రాజ్ కౌశల్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాంః మందిరా బేడీ భర్త మరణంపై ప్రముఖుల సంతాపం
మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. `మై బ్రదర్` చిత్ర దర్శకుడు ఓనిర్ సంతాపం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయాడంటూ ఎమోషనల్ అయ్యారు.
బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ హఠాన్మరణం బాలీవుడ్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. హిందీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఆయన స్నేహితుడు, `మై బ్రదర్` చిత్ర దర్శకుడు ఓనిర్ సంతాపం వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయాడంటూ ఎమోషనల్ అయ్యారు.
`చాలా త్వరగా వెళ్లిపోయారు. నిర్మాత రాజ్ కౌశల్ని కోల్పోయాం. నా మొదటి చిత్ర నిర్మాత. మా దృష్టిని నమ్ముకుని మాకు అన్ని వేళలో సపోర్ట్ గా నిలిచిన వారిలో ఒకరు. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్తిస్తున్నా` అని ట్వీట్ చేశారు.
నటి నేహా దూపియా స్పందిస్తూ, ఆయనతో దిగిన ఫోటోని పంచుకుంది. `రాజ్, మీతో అనేక జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ చిత్రాన్ని తీశాం. మీరు లేరనే వార్తలను నమ్మలేకపోతున్నాం` అంటూ మందిరాకి ధైర్యం చేకూరని వెల్లడించారు.
టిస్కా చోప్రా స్పందిస్తూ `రాజ్ కౌశల్ మాతో లేరనే విషయాన్ని ఊహించలేకపోతున్నాం. చాలా షాకింగ్గా ఉంది. నా హృదయం మందిరా బేడి, వారి పిల్లల వైపు లాగుతోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజ్ సున్నితమైన ఆత్మ మిస్ అయ్యింది` అని ట్వీట్ చేసింది. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ రాజ్ కౌశల్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్ కౌశల్ దర్శకుడిగా `ప్యార్ మెయిన్ కభీ కభీ`,`షాది కా లడూండ్ అంథోని కౌన్ హై` చిత్రాలను రూపొందించారు. అలాగే నిర్మాతగా `మై బ్రదర్` లాంటి పలు చిత్రాలను నిర్మించారు. మందిరా, రాజ్ కౌశల్ 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో కుమారుడు వీర్ జన్మించారు. అలాగే ఓ కుమార్తెని దత్తత తీసుకున్నారు. మందిరా బేడీ ప్రభాస్ `సాహో` చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.