దిలీప్ కుమార్ మరణంపై బీజేపీ లీడర్ వివాదాస్పద ట్వీట్, సిగ్గులేదా అంటూ ఊర్మిళ ఫైర్!
నటుడు దిలీప్ కుమార్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న బీజేపీ నేత ట్వీట్ వివాదాస్పదం కాగా, నటి, శివసేన లీడర్ ఊర్మిళ, సిగ్గు లేదా అంటూ ఫైర్ అయ్యారు.
హర్యానా రాష్ట్ర బీజేపీ నేత ఒకరు దిలీప్ కుమార్ మరణానికి సంతాపం తెలుపుతూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సదరు బీజేపీ నేత హిందూ పేరుతో పరిశ్రమలో రాణించిన ముస్లింగా దిలీప్ కుమార్ ని అభివర్ణించడం జరిగింది. ఓ లెజెండరీ నటుడు మరణంపై బీజేపీ నేత స్పందించిన తీరుకు హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ మండిపడ్డారు. ఆ ట్వీట్ కి తనదైన రీతిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు.
దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ కాగా, కొందరు సినీ పెద్దల సలహా మేరకు స్క్రీన్ నేమ్ దిలీప్ కుమార్ గా మార్చుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. హర్యానా రాష్ట్ర సోషల్ మీడియా & ఐటీ వింగ్ హెడ్ అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. ''దిలీప్ కుమార్ అనే హిందూ పేరుతో సినిమా ప్రపంచంలో ఎదిగి డబ్బులు సంపాదించిన యూసుఫ్ ఖాన్ మరణం, చిత్ర పరిశ్రమకు తీరని లోటు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు.
దిలీప్ కుమార్ వ్యక్తిత్వాన్ని కించపరిచేదిగా ఉన్న ఈ ట్వీట్ పై ఊర్మిళ మండిపడ్డారు. సిగ్గు లేదా అంటూ అతని ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. రంగీలా ఫేమ్ ఊర్మిళ మొదట కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆమె అధికార శివసేన పార్టీ లీడర్ గా కొనసాగుతున్నారు.