బిగ్ బాస్ 3: తమన్నా, అలీ రెజాలకు నాగ్ వార్నింగ్!
అలీరెజా-హిమజ వాగ్వాదం.. మధ్యలో తమన్నా కలగజేసుకోవడం.. టాస్క్లో రవికృష్ణకు గాయం కావడం.. వితికా తెగ బాధపడటం.. శ్రీముఖిని రాహుల్ పర్సనల్ అటాక్ చేయడం.. ఇలా అందరి వ్యవహారాలను టచ్ చేశాడు కింగ్ నాగార్జున. వితికా, రాహుల్, తమన్నా, అలీరెజాలను ఓ రౌండ్ వేసుకున్న నాగ్.. చివర్లో ఓ ఆట ఆడించాడు.
బిగ్ బాస్ మూడో సీజన్ మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. శనివారం ఎపిసోడ్ లో నాగ్ ఈ వారం మొత్తంలో హౌస్ మేట్స్ ప్రవర్తన గురించి మాట్లాడి వారికి వార్నింగ్ లు ఇచ్చారు. ముందుగా అలీని 21 గుంజీలు తీయమని చెప్పిన నాగ్.. నీకు డ్రెస్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ మాత్రం లేదని అన్నారు. హిమజ విషయంలో అలీ ప్రవర్తనపై నాగ్ మండిపడ్డారు.
తమ ప్రమేయం లేకుండా ఒంటి మీద చేయి వేస్తే మహిళలు అలాగే రియాక్ట్ అవుతారని అన్నారు. బయట కూడా అలాగే చేస్తారంటూ హిమజకి సపోర్ట్ గా నిలిచారు. ఈ విషయంలో మిగతా హౌస్ మేట్స్ పై నాగ్ ఫైర్ అయ్యారు. అలీకి ఎవరు అడ్డు చెప్పలేదని తమన్నా మాత్రమే అతన్ని ఎదురించిందని.. ఆమెను మెచ్చుకున్నాడు. ఆ తరువాత తమన్నాని రవి విషయంలో తీవ్రంగా విమర్శించారు నాగ్.
జర్నలిజంపై తమన్నా నోరు పారేసుకోవడంతో ఆమె చేసింది తప్పని చెప్పి ఆమెతో జర్నలిస్టులందరికీ క్షమాపణలు చెప్పించారు. ఇక టాస్క్ లో రవి చేతితో అద్దాన్ని పగలగొట్టడం కరెక్ట్ కాదని అతడిని సుత్తిమెత్తగా హెచ్చరించారు. ఈ విషయంలో వితికా చాలా కన్సర్న్ చూపించిందని మెచ్చుకున్నట్టే మెచ్చుకున్న నాగ్.. డబ్బులు దాచుకున్న తరువాత రవి గురించి బాధపడుతున్నావా? కాసుల తరువాత కన్నీరు పెడుతున్నావా? అంటూ ఆమె గాలి తీసేశాడు.
శ్రీముఖిని ఉద్దేశించి రాహుల్ ఫాల్తూ అని అనడం.. అలాంటి మాటలు ఇంకో సారి మాట్లాడొద్దు అంటూ అతనికి సూచించాడు. ఇంటి పెద్దగా ఉన్న బాబా భాస్కర్.. అంత గొడవ జరుగుతున్నా మౌనంగా ఉండటంపై కూడా కామెంట్ చేశాడు. పునర్నవికి హౌస్ రూల్స్ పాటించాలని చెప్పారు. ఆ తరువాత కంటెస్టెంట్స్ ని ఏడు జంటలుగా విడగొట్టి గేమ్ ఆడించారు. సేఫ్ జోన్ లో ఎవరున్నారో చెప్పకుండా ఎపిసోడ్ ని ముగించారు.