సారాంశం
సోమవారం వచ్చిందంటే కంటెస్టెంట్స్ మధ్య వాడివేడి వాతావరణం నెలకొంటుంది. ఐదో వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.
బిగ్ బాస్ సీజన్ 7 ఐదో వారంలోకి ఎంటర్ అయ్యింది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో పవర్ అస్త్ర గెలిచిన సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ నుండి మినహాయింపు పొందుతారు. శివాజీ తన పవర్ అస్త్ర కోల్పోయిన నేపథ్యంలో అతడు నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొనాలి. ఇక టేస్టీ తేజా హోస్ట్ నాగార్జున చేత నేరుగా నామినేట్ చేయబడ్డాడు. కాబట్టి అతడు ఆల్రెడీ నామినేట్ అయ్యాడు కాబట్టి అతన్ని ఎవరూ నామినేట్ చేయరు.
కాబట్టి శివాజీ, ప్రియాంక, గౌతమ్, శుభశ్రీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ వారం నామినేట్ చేసే వ్యక్తి గుండెల్లో బాకు దించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ప్రతి కంటెస్టెంట్ మెడకు మందపాటి షీట్ తగిలించుకుని ఉంటారు. తగిన కారణాలు చెప్పి నామినేట్ చేసిన కంటెస్టెంట్ మెడలో ఉన్న షీట్ కి కత్తి గుచ్చాలి. ఈ నామినేషన్స్ ప్రక్రియలో శివాజీతో ప్రియాంక, అమర్ దీప్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. అలాగే ప్రియాంక, ప్రిన్స్ యావర్ కూడా గొడవపడ్డారు.
నేటి ఎపిసోడ్ చూస్తే కానీ... ఈ వారం నామినేట్ అయ్యింది ఎవరో తెలుస్తుంది. మరోవైపు ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, భోలే షామిలి, అంజలి పవన్, నాయని పావని ఈ లిస్ట్ లో ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెడుతున్నారనేది తాజా సమాచారం.
వీరందరూ దాదాపు సీరియల్ నటులే. నిజంగా వీరు హౌస్లోకి వెళితే సీరియల్ బ్యాచ్ శక్తి పెరిగే అవకాశం ఉంది. ప్రతి సీజన్ కి హౌస్లో రెండు మూడు గ్రూప్ లు ఏర్పడతాయి. ఈసారి సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ గా హౌస్ నడిచే అవకాశం ఉంది. ఆల్రెడీ శివాజీ తన వ్యతిరేకత వాళ్లపై ప్రకటించాడు. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక చూడాలి ఏం జరగనుందో...