ఫైనల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటుందనుకున్న రతికా రోజ్ నాలుగు వారాలకే పెట్టే బేడా సర్దినట్లు తెలుస్తుంది. ఈ వారం రతికా రోజ్ ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
కంటెంట్ ఇవ్వాలని, ఎప్పుడూ కెమెరాలు మనల్నే కవర్ చేయాలని అతి చేస్తే ఇలానే అవుతుంది. గత సీజన్లో గీతూ రాయల్ గతే రతికా రోజ్ కి పట్టింది. ఇంకా గీతూ చాలా బెటర్ గేమ్ ఆడింది. 9 వారాలు హౌస్లో ఉంది. రతికా రోజ్ మొదటి రోజు నుండి ఫేక్ గేమ్ స్టార్ట్ చేసింది. ఎక్స్ లవర్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ ని సీన్లోకి లాగింది. ఇక ఎమోషనల్ సీన్ క్రియేట్ చేసింది. పేరెంట్స్ కంటే అతడిని బాగా మిస్ అవుతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది.
రతికా మాజీ ప్రియుడు ఎవరనే సందేహాలు ప్రేక్షకుల మనస్సులో కలిగేలా చేసింది. బయట ఉన్న రతికా రోజ్ పిఆర్ టీమ్ రంగంలోకి దిగారు. రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ఒకప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని మీడియా బాగా కవర్ చేసింది. రతికా రోజ్ కి రావాల్సిన గుర్తింపు వచ్చింది. అయితే రాహుల్ సిప్లిగంజ్ వ్యతిరేక పోస్ట్లు పెట్టడంతో ప్లాన్ బెడిసి కొట్టింది. కొందరు తమ టాలెంట్ కంటే ఇతరులను వాడుకొని లబ్దిపొందాలని చూస్తారని ఆయన వరుస పోస్ట్స్ పెట్టారు.దీంతో రతికాకు పబ్లిసిటీ కంటే నెగిటివిటీ పెరిగింది.
అలాగే తన స్వార్థం కోసం పల్లవి ప్రశాంత్ వంటి పల్లెటూరి కుర్రాడిని రెచ్చగొట్టడం కూడా ప్రేక్షకులు గమనించారు. కావాలని అతన్ని గెలికి, సన్నిహితంగా ఉండేందుకు ట్రై చేసిన రతికా రోజ్ నామినేషన్స్ రోజు ప్లేటు పూర్తిగా పిరాయించింది. హౌస్లో ప్రతి కంటెస్టెంట్ తో ఆమె ప్రవర్తనలో నిజాయితీ కరువైంది. వీక్నెస్ ఆధారంగా గేమ్ ఆడాలని చూసింది. పల్లవి ప్రశాంత్ ని రతికా రోజ్ అన్నమాటలు కూడా ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి.
వీడి బుర్రల్లో మట్టే ఉంది. పేరెంట్స్ సరిగా పెంచలేదా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో నాగార్జున కూడా చివాట్లు పెట్టాడు. ప్రతి సీజన్లో విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేసే కంటెస్టెంట్స్ ఒకరిద్దరు ఉంటారు. ఈ సీజన్ కి రతికా రోజ్ అని చెప్పొచ్చు. టేస్టీ తేజా ఎలిమినేట్ అవుతారని అనుకుంటే రతికా రోజ్ ఇంటికి పోతుంది. రతికా రోజ్ ఎలిమినేషన్ పై నెటిజెన్స్ లో మెజారిటీ వర్గాలు మంచి నిర్ణయం అంటున్నారు.