బిగ్ బాస్ 3: టాస్క్ లో ఫైర్ అయిన మహేష్.. గేమ్ ఆడనంటూ గొడవ!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 71 ఎపిసోడ్లను పూర్తి చేసి సోమవారం నాటితో 72వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
బిగ్ బాస్ సీజన్ 3 పది వారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో రవి ఎలిమినేట్ అవ్వడంతో బాబా భాస్కర్ బాధపడ్డారు. ఇక్కడ నుండి అందరూ వెళ్లాల్సిందే.. ఎందుకు బాధ పడుతున్నారు అంటూ శ్రీముఖి కంట్రోల్లో పెట్టింది.
ఈ వారం నామినేషన్స్లో భాగంగా ‘రాళ్లే రత్నాలు’ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో ఆకాశం నుండి 20, 50, 100, 200 విలువ కలిగిన రాళ్ల వర్షం కురుస్తోంది. ఇంటి సభ్యులు ఆ రాళ్లను సొంతం చేసుకుని తమ దగ్గర దాచుకోవాలి. ఫైనల్గా ఎవరు ఎక్కువ విలువ కలిగిన రాళ్లను సొంతం చేసుకుంటే.. వాళ్లే ఈవారం నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు. తక్కువ ఉన్నవాళ్లు నామినేట్ కాబోతున్నారు.
అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్కి కెప్టెన్గా ఉన్న శ్రీముఖికి మినహాయింపు లభించింది. ఆమెను ఈ టాస్క్కి సంచాలకులుగా నియమించారు. టాస్క్ జరుగుతున్న సమయంలో గొడవలు జరగడం కామనే.. అలానే ఈ టాస్క్ లో కూడా హౌస్ మేట్స్ గొడవ పడ్డారు కానీ తొందరగానే కూల్ అయిపోయారు.
టాస్క్ లో మహేష్ దగ్గర ఉన్న రాళ్లను బాబా భాస్కర్, రాహుల్ లు లాక్కునే ప్రయత్నం చేయగా.. మహేష్ ఫైర్ అయ్యాడు. 'ఇవి కూడా తీసుకోండి..' అంటూ తన దగ్గర ఉన్న రాళ్లను విసిరేశాడు. టాస్క్ ఆడనంటూ మహేష్ తప్పుకుంటుండగా.. శ్రీముఖి అతడ్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఫైనల్ గా మహేష్ రాజీపడి గేమ్ ఆడాడు. ఈ టాస్క్ రేపు కూడా కంటిన్యూ అవ్వనుంది.