రామ్ పోతినేని హీరోగా నటించిన `స్కంద` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్కి బాలయ్య వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. వినకూడనివి వింటే మామూలుగా ఉండదంటూ హెచ్చరించారు.
రామ్ పోతినేని హీరోగా నటించిన `స్కంద` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో రామ్కి బాలయ్య వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. వినకూడనివి వింటే మామూలుగా ఉండదంటూ హెచ్చరించారు. కొన్ని వినిపిస్తున్నాయంటూ తనదైన స్టయిల్లో వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బాలయ్య. దీంతో అటు రామ్, ఇటు బాలయ్య మధ్య స్టేజ్పై కాసేపు సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, బాలయ్యని ఆకాశానికి ఎత్తేశాడు. అవార్డులు, రివార్డులు కాదు, ఇలాంటి క్రేజ్ ఉండాలన్నారు. బాలయ్య పాత తరం, ఇప్పటితరం, కొత్తతరం వాళ్లతో కూడా డాన్సులు వేయిస్తాడని, వాళ్లు కూడా జై బాలయ్య అనేలా చేస్తాడని, మూడు తరాలను అలరించే ఏకైక హీరో బాలయ్య అని తెలిపారు రామ్. ఇలాంటి అభిమానం ముందు అవార్డులు, రివార్డులు తక్కువే అనే ఉద్దేశ్యంలో రామ్ వ్యాఖ్యానించాడు.
అంతేకాదు, పెద్దవాళ్లని, యూత్ని, అమ్మాయిలను, అబ్బాయిలను, మాస్, క్లాస్ తేడా లేకుండా అందరు జై బాలయ్య అంటున్నారని, షూటింగ్లు పూర్తయ్యాక కూడా చివర్లో జై బాలయ్య అంటున్నారని తెలిపారు. అయితే `స్కంద` ఈవెంట్కి గెస్ట్ గా బాలయ్య బాబాయ్ వస్తున్నారని తెలిసి పద్ధతిగా కోసం కలుద్దామని ఫోన్ చేస్తే, మనకు అలాంటి పద్ధతులేం లేవుగా అంటూ కామెంట్ చేశారని రామ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా బోయపాటి గురించి చెబుతూ, మొండితనానికి ఆయన కేరాఫ్ అని, ఏదైనా వచ్చేంత వరకు వదిలిపెట్టరని తెలిపారు. అందుకే ఆయన సినిమాలు అంత బాగా వస్తాయని, అలానే ఈ సినిమా తీశారని తెలిపారు. ఇదే కంటిన్యూ చేయాలన్నారు. మరోవైపు శ్రీలీల గురించి చెబుతూ, ఎవరైతే కనీసం ఒక్కరోజైనా డేట్స్ ఇస్తారో అదే శ్రీలీల అని, ఆమె డేట్స్ దొరకడం అంత కష్టమని తెలిపారు. ఇందులో అద్భుతంగా చేసిందని, సర్ప్రైజ్ చేస్తుందని తెలిపారు. అలానే సాయీ మంజ్రేకర్ చూడ్డానికి గందరగోళంగా కనిపిస్తుందని, కానీ అద్భుతమైన నటి అని చెప్పారు. థమన్ పాటలు నెక్ట్స్ లెవల్ అని, ఓ పాటని విడుదల చేయలేదని, ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తామని, అది ఊగిపోయేలా ఉంటుందన్నారు.
నిర్మాతలు, టీమ్తో సహా అందరికి ధన్యవాదాలు తెలిపిన రామ్ చివరికి తన అభిమానులను ఉద్దేశించి ఒకే మాట చెప్పి వాహ్ అనిపించారు. `నా లక్కూ మీరే, నా కిక్కూ మీరే` అని చెప్పడంతో ప్రాంగణం హోరెత్తిపోయింది. రామ్, శ్రీలీల, సాయీ మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన `స్కంద` చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శిల్పకళా వేదికలో జరిగింది. సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.
