ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావుకి నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయనతో తాను చేసిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటన్నారు.

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు తాతినేని రామారావు బుధవారం ఎర్లీ మార్నింగ్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. దర్శకుడి హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ స్పందించారు. దర్శకుడనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు మరణం దురదృష్టకరం అని తెలిపారు. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసిందన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

`తాతినేని రామారావు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే 'యమగోల' లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన 'తల్లితండ్రులు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. 

బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను` అని వెల్లడించారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య `ఎన్‌బీకే 107` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతుంది. ఇందులో శృతి హాసన్‌ కథానాయిక.