ఆ విషయంలో వాడు అదృష్టవంతుడు ఇంకో కొడుకున్నాడు...కన్నీరు పెట్టుకున్న కోటా, బాబు మోహన్!
కోటా-బాబు మోహన్ తొలిసారి కలిసి ఆలీతో సరదాగా షోకి అతిథులుగా విచ్చేశారు. షో మొత్తం కోటా మార్కు పంచులతో సాగింది. ఐతే చివర్లో కోటా గారు తమ జీవితంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.
వెండితెరపై కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ జోడీ నవ్వులకు చిరునామా అని చెప్పాలి. ఈ ఇద్దరు నటులు కలిసి పండించిన కామెడీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు మరచిపోరు. గురు శిష్యులుగా, యజమాని-బంటుగా, స్నేహితులుగా, శత్రువులుగా, తండ్రి-కొడుకులుగా నటించిన కోటా, బాబు మోహన్ తమ మార్కు కామెడీతో నవ్వులు పూయించారు. 'సుబ్బారావ్ గారు నమస్కార మండి...'అని కోటా అనగానే...వెనక్కితిరిగిన బాబు మోహన్ ని కోటా తన్నడం అనేది మహా ఫేమస్ అయ్యింది.
దర్శకుడు ప్రతి చిత్రంలో వీరి కోసం ఓ ప్రత్యేకమైన కామెడీ ట్రాక్ రాసుకొనే వారు. కోటా-బాబు మోహన్ జోడీ కనిపిస్తే చాలు ఆటోమేటిక్ తెలుగు ప్రేక్షకులు నవ్వేసేవారు. పదుల సంఖ్యలో వీరి కాంబినేషన్ లో చిత్రాలు రాగా, ఆరోగ్యకరమైన హాస్యం పండించడం జరిగింది. ఆఫ్ స్క్రీన్ లో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్న కోటా-బాబు మోహన్ తొలిసారి కలిసి ఆలీతో సరదాగా షోకి అతిథులుగా విచ్చేశారు. షో మొత్తం కోటా మార్కు పంచులతో సాగింది. ఐతే చివర్లో కోటా గారు తమ జీవితంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.
బాబు మోహన్ మరియు కోటా కొడుకులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 'వాడికి నాకూ ఓ కనెక్షన్ ఉందిరా...వారికి కొడుకు పోయాడు, నాకు కొడుకు పోయాడు. కాకపోతే నాకంటే వాడు కొంచెం అదృష్టవంతుడు, వాడికి ఇంకో కొడుకు ఉన్నాడు. నాకు ఒక్కగానొక్క కొడుకు అని కోటా చనిపోయిన తన కుమారుడిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం యాదృచ్ఛికం అని బాబు మోహన్ అన్నారు. చనిపోయిన బిడ్డలను తలచుకొని ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. ఆలీతో సరదాగా తాజా ప్రోమోలో అనేక ఆసక్తికర విషయాలు పొందుపరిచారు.