టికెట్ కొని గంటన్నరకు పైగా వెయిట్ చేసినా.. షో వేయకపోవడంతో.. విరూపాక్ష సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్స్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో థియేటర్ పై దాడి చేశారు ప్రేక్షకులు. అసలు ఏం జరిగిందంటే..?
సినిమా కోసం థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించారు లక్ష్మీకళ థియేటర్ యాజమాన్యం. విరూపాక్ష సినిమా చూడటం కోసం.. ఆదివారం సాయంత్రం ప్రేక్షకులు టిక్కెట్ కొనుగోలు చేసి, లోనికి వెళ్లగా.. గంటన్నర తర్వాత కూడా షో వేయక పోవడంతో ఆగ్రహానికి గురయ్యారు ప్రేక్షకులు. అంతే కాదు సిబ్బంది చెప్పిన నిర్లక్ష్య సమాధానంతో .. కోపం కట్టలు తెంచుకోవడంతో.. థియేటర్ పైన దాడి చేసిన ఘటన జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని మూసాపేటలో చోటు చేసుకుంది.
మూసాపేట్ లక్ష్మీకళ థియేటర్లో... మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆదివారం ఫస్ట్ షో ఆరు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఆడియన్స్ అంతా యదావిదిగా టికెట్స్ కొని.. లోపలికి వెళ్లి కూర్చున్నారు. లోనికి వెళ్లి గంటకు పైగా షో కోసం వేచి చూశారు. షో మాత్రం ఎంతకూ ప్రారంభం కాలేదు. థియేటర్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారికి సరైన సమాధానం చెప్పలేదు. దాంతో ప్రేక్షకులు ఆగ్రహంతో థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న సనత్ నగర్ పోలీసులు దాడి చేసిన ప్రేక్షకులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
మరోవైపు, టిక్కెట్ కొన్న ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం డబ్బులను తిరిగి ఇచ్చింది. కాని ఇక్కడ కూడా వారు కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. వెయ్యికిపైగా టికెట్టు అమ్ముడుపోగా.. వారిని సింగిల్ లైన్ లో నించోబెట్టి.. రీ ఫండ్ చేశారు. ఆరు గంటల సినిమా కోసం తాము వచ్చామని, ఇక్కడ విరూపాక్ష ప్రదర్శిస్తున్నారని, తాము సినిమా కోసం గంటన్నర పాటు వేచి చూశామని కానీ సినిమా ప్రారంభం కాలేదని ఓ ప్రేక్షకుడు చెప్పారు. గంటన్నర గడిచినా షో ప్రారంభం కాకపోయేసరికి డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వమంటే సింగిల్ లైన్ కట్టాలని చెబుతున్నారని, వెయ్యి మంది ఉన్నారని, వీరికి సింగిల్ లైన్ ఏం సరిపోతుందని ప్రశ్నించారు.
