ఇప్పుడిప్పుడే సుచీలీక్స్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుంటున్న చిన్మయి తన అభిమానులకు సమాధానం చెప్పుకోలేనంటూ చాలా కాలం బాధ పడ్డ చిన్మయి అమెరికాలో కారు దోపిడీతో మరో సారి తనతో ఆడుకోవద్దని దేవున్ని కోరిన చిన్మయి
సుచీలీక్స్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే సింగర్ చిన్మయి శ్రీపాదకు మరో షాక్ తగిలింది. చిన్మయి శ్రీపాద మ్యూజిక్ టూర్లో భాగంగా ప్రస్తుతం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది. అక్కడ కొందరు దుండగులు చిన్మయి కారును ధ్వంసం చేసి, అందులోని వస్తువులను దొంగలించారట. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్ ద్వారా వెల్లడించింది. కారును పార్కింగ్ చేసి ఉండగా చోరీ జరిగినట్లు ట్వీట్ చేసింది. కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందట. ఈ ప్రాంతంలో ఇలాంటి దొంగతనాలు సాధారణమేనని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు పేర్కొన్నట్లు తెలిపింది.
నిజంగా అక్కడ పోలీసులు చాలా బాధ్యతతో ప్రవర్తించారని చిన్మయి పేర్కొంది. చోరీ జరుగుతుండగా చూసి, వారిపై కేకలు పెట్టిన పక్కింటి వ్యక్తికి ధన్యవాదాలు తెలిపింది. మంచి వారు ఇంకా భూమిపై ఉన్నారని ఆమె అంది. చోరీకి గురైన తన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దేవుడా దయచేసి వెళ్లి మరొకరితో ఆడుకో’ అని చిన్మయి ట్వీట్ చేస్తూ.. నిరాశ వ్యక్తం చేసింది. ఇంతకుముందు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాస్పోర్ట్, ఇతర వస్తువులు కూడా ఇలాగే అమెరికాలో చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని ఆయన ఫేస్బుక్ ఖాతా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా సుచీలీక్స్ వ్యవహారంతో తలనొప్పి పెంచిన దేవుడు మళ్లీ ఇలా తనతో ఆడుకుంటున్నాడని చిన్మయి వాపోయింది.
