బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, అఖిల్‌, తేజస్వి మదివాడ టీవీ షోలో గొడవపడ్డారు. అది కూడా యాంకర్‌ సుమ షోలో ఒకరిపై ఒకరు అరుస్తూ రెచ్చిపోవడం షాకిస్తుంది.  

యాంకర్‌ సుమ గతంలో `క్యాష్‌` ప్రోగ్రామ్‌కి వ్యాఖ్యాతగా చేసేది. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో విశేషంగా ఆదరణ పొందింది. కొన్ని వందల ఎపిసోడ్లు ప్రసారం అయ్యింది. మంచి టీఆర్‌పీ సాధించింది. తాజాగా ఆ షో స్థానంలో `సుమ అడ్డా` అనే షోని రన్‌ చేస్తున్నారు. దీనికి సుమనే యాంకర్‌. పేరు మారింది గానీ, షో కాన్సెప్ట్ మాత్రం సేమ్‌. నలుగురు గెస్ట్ లు రావడం, వారితో సుమ గేమ్‌ ఆడించడం, ప్రశ్నించడం, చిన్న చిన్న స్కిట్లు ప్రదర్శింప చేయడం, ఏదైతేనేం నవ్వులు పూయించడం. షో సేమ్‌ క్యాష్‌నే తలపిస్తుంది. 

తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. వచ్చే శనివారం( మార్చి 4)న ప్రసారం అయ్యే కొత్త ఎపిసోడ్‌ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. అందుకు కారణం ఇందులో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, అఖిల్‌, తేజస్వి మదివాడ గొడవ పడిపోవడమే. అది కూడా సుమ ముందు గొడవకి దిగి అర్థాంతరంగా షో నుంచి వెళ్లిపోవడమే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పైగా అందులో అరియానా చేసిన కామెంట్ షాకింగ్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే.. 

`సుమ అడ్డా` షోలో అరియానా, అఖిల్‌ సార్థక్‌, తేజస్వి మదివాడ, రోల్స్ రైడా పాల్గొన్నారు. వీరితో తనదైన స్టయిల్‌లో గేమ్‌ ఆడిస్తూ నవ్వులు పూయించింది సుమ. పదాలను నత్తిగా పలికే ఎపిసోడ్‌ మాత్రం మరింత నవ్వులు పూయించింది. ఆ తర్వాత ఓ స్కిట్‌ చేయించింది సుమ. అందులో భాగంగా తమకి బిజినెస్‌లున్నాయి, గెస్ట్ గా అరియానాని పిలిచారు. అందుకు స్టయిల్‌గా వాక్‌ చేసుకుంటూ వచ్చింది అరియానా. 

యాంకర్‌ సుమ.. అరియానాని సంభోదిస్తుంటుంది. ఇంతలోనే అఖిల్‌ జోక్యం చేసుకుని `ఏంటి రెండు లక్షలు ఇచ్చి ఈమెనా తీసుకొచ్చింది నువ్వు` అంటూ ముఖం మీదే అంటాడు. దీంతో మండిపోయిన అరియానా.. `చెంప పగుల్దది, నీ బడ్జెట్‌కి నేనే ఎక్కువ` అంటూ రెచ్చిపోయింది. దీంతో అఖిల్‌కి దిమ్మతిరిగిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా అలా ఉండిపోయాడు. ఇక నీకు చెప్పిన టైమేంటి? నువ్వు ఎప్పుడొచ్చావంటూ ప్రశ్నించాడు అఖిల్‌. దీనికి తేజస్వి మదివాడ రియాక్ట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వచ్చిన బచ్చాగాడివి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌ అంటూ రెచ్చిపోయింది. దీంతో ఈ ముగ్గురు యాంకర్‌ సుమ ముందే గొడవకు దిగారు. 

యాంకర్‌ సుమ వీరిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కామెడీ స్కిట్‌ కాస్త వికఠించి గొడవగా మారిపోయింది. దీంతో ఈ షో చేయను నేను అంటూ మధ్యలోనే `సుమ అడ్డా` నుంచి వెళ్లిపోయాడు అఖిల్‌. ఆయన్ని తీసుకు రావడం కోసం సుమ, మిగిలినవారంతా వెళ్లడంతో షో ముగిసింది. ఇది ఆద్యంతం ఉత్కంఠకి గురి చేసింది. ఏం జరిగిందనేది ఉత్సుకతని రేకెత్తిస్తుంది. మరి ఇందులో అసలు ఏం జరిగిందనేది శనివారం ఎపిసోడ్‌లో తేలనుంది. 

అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి టీఆర్‌పీ స్టంట్స్ చాలా చూశాం. ఈటీవీలోనే ఇలాంటి టీఆర్‌పీ స్టంట్స్ ఉంటాయని, సాల్‌ తీయ్‌, బాగా చేశారు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. టీఆర్‌పీ కోసం వేరే లెవల్‌ డ్రామా అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇది రచ్చ రచ్చ అవుతుంది.