ఏపీలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల టికెట్ ధరల పెంపు.. ఉత్తర్వులు జారీ.. పూర్తి వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సంక్రాంతి పండుగకు విడుదల కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సంక్రాంతి పండుగకు విడుదల కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల టిక్కెట్ రేట్ల పెంపు కోసం ఆ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ రెండు సినిమాల టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరసింహారెడ్డి చిత్రానికి రూ. 20, వాల్తేరు వీరయ్య చిత్రానికి రూ. 25 చొప్పున టికెట్ రేట్ను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ధరలపై ఈ పెంపు వర్తించనుంది. చిత్రం విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు మాత్రమే ఈ ధరల పెంపు అమల్లో ఉంటుందని తెలిపింది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లకు కూడా ఈ ధరల పెంపు ఒకే విధంగా ఉండనుంది. ఇక, ఈ రెండు చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ఈనెల 13న విడుదల కానుంది.