అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఫులే చిత్రం సెన్సార్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ మూవీపై బ్రాహ్మణ సంఘాలు రిలీజ్ కి ముందే మండిపడుతున్నాయి. దీనితో అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు, బ్రాహ్మణ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.   

సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫులే జీవిత చరిత్ర ఆధారంగా 'ఫులే' అనే టైటిల్ తో డైరెక్టర్ అనంత్ మహదేవన్ ఈ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 11 న రిలీజ్ కావలసిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందులు, కుల పరమైన వివాదాల కారణంగా ఏప్రిల్ 25కి వాయిదా పడింది. ఈ మూవీ సెన్సార్ బోర్డు CBFC వద్దకి ఏప్రిల్ 7న వెళ్ళింది. అక్కడి నుంచే వివాదాలు మొదలయ్యాయి.ఫులే చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. 

సెన్సార్ సభ్యులు వివాదాస్పదంగా అనిపించిన కొన్ని డైలాగులని, సన్నివేశాలతో తొలగించాలని సూచించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు బయటకి వచ్చాయి. దీనితో ఫులే మూవీ రిలీజ్ కాకముందే పెద్ద ఎత్తున కాంట్రవర్సీ మొదలైంది. ఎప్పుడూ తన అభిప్రాయాలని బోల్డ్ గా చెప్పే దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ వివాదంలో దూరి మరింత పెద్దది చేశారు. 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC), బ్రాహ్మణ సంఘాలపై అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. నా జీవితంలో నేను నటించిన మొదటి నాటకం జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే లది. ఇండియాలో కుల వ్యవస్థే లేదని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు బ్రాహ్మణ సంఘాలు ఒక సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి. ఇలా ప్రవర్తిస్తున్నందుకు బ్రాహ్మణ సంఘాలు సిగ్గుతో చచ్చిపోవాలి. లేదా ఇండియా వదిలిపెట్టి మీరు మాత్రమే ప్రత్యేకంగా ఒక దేశాన్ని సిద్ధం చేసుకుని అందులో ఉండండి అని విరుచుకుపడ్డారు. 

View post on Instagram
 

 CBFC ని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు సెన్సార్ కి వెళ్లిన సినిమా గురించి బ్రాహ్మణ సంఘాలకు ఎలా తెలిసింది. సెన్సార్ బోర్డులో సినిమా చూసేది కేవలం నలుగురు మెంబర్స్ మాత్రమే. వారి నుంచి సమాచారం బ్రాహ్మణులకు ఎలా లీక్ అయింది. అసలు రిలీజ్ కానీ చిత్రంలోని అంశాలు బయటకి ఎలా వెళ్లాయి అని ప్రశ్నించారు. ఈ సమాజంలో ఉన్న చేదు నిజాలని సినిమా రూపంలో చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. పంజాబ్ 95, ధడక్ 2, తీస్ లాంటి చిత్రాలన్నీ సమాజంలో ఉన్న చీకటి వ్యవస్థని బయట పెట్టాలని ప్రయత్నించాయి. కానీ ఆ చిత్రాలని సెన్సార్ కారణాలతో రిలీజ్ కాకుండా చేశారు. ఇంకా ఎన్ని సినిమాలు ఇలా బలి కావాలి అని అనురాగ్ కశ్యప్ ప్రశ్నించారు. 

ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ నెటిజన్లతో కూడా గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేయడానికి ప్రయత్నించిన కొందరు నెటిజన్లకు అనురాగ్ కశ్యప్ అసభ్యకర వ్యాఖ్యలతో సంచలన రిప్లై ఇచ్చారు. బ్రాహ్మణులని టార్గెట్ చేస్తూ ఆయన అసభ్యంగా చేసిన ఒక కామెంట్ వైరల్ అవుతోంది.