సుశాంత్ కేసులో మరో షాక్.. అపాయం ఉందన్నా పట్టించుకోలేదు
దాదాపు సుశాంత్ చనిపోయి 40 రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఆ కేసునే పట్టించుకోలేదు. దీంతో సుశాంత్ అనుమానాస్పద మృతిపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు అనేక మలుపులతో సాగుతుంది. గంటగంటకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని చెబుతున్నారు. ఓ డాక్టర్ సుశాంత్ది ఆత్మహత్య కాదు హత్య జరిగిందని వీడియో విడుదల చేసింది. మరోవైపు ముంబయి కమిషనర్ ఆయనది ఆత్మహత్యే అని, చనిపోవడానికి ముందు సుశాంత్ నెట్లో నొప్పి లేకుండా చనిపోవడం ఎలాగో వెతికినట్టు వెల్లడించారు. ఇక సుశాంత్ వంట మనుషులు మరో కథని చెబుతున్నారు. మాజీ ప్రియురాలు మరో స్టోరీ చెప్పింది.
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు నేపథ్యంలో బీహార్ పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్ వినియోగిస్తున్న మొబైల్ సిమ్ కార్డులు అతని పేరు మీద లేవని తెలిపారు. గత కొన్ని నెలలుగా వరుసగా సిమ్లు మారుస్తున్నట్టు, జూన్ 9 నుంచి 13వ తేదీ మధ్యలో సుశాంత్ ఏకంగా 14 సిమ్లు మార్చినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే బీహార్ పోలీసులకు ముంబయి పోలీసులు సహకరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
సుశాంత్కి అపాయం ఉందని ఫిబ్రవరి 25నే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. ఫిబ్రవరి 25న తానిచ్చిన ఫిర్యాదులో సుశాంత్కు ఎవరెవరి నుంచి ప్రమాదం ఉందో అనుమానితుల పేర్లు ప్రస్తావించానని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాంద్రా పోలీసులను కోరారని, దాదాపు సుశాంత్ చనిపోయి 40 రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఆ కేసునే పట్టించుకోలేదు. దీంతో సుశాంత్ అనుమానాస్పద మృతిపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాట్నా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుశాంత్ అకౌంట్ నుంచి తన ప్రియురాలు రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందని, సుశాంత్ మృతికి దారితీసిన పరిస్థితుల్లో ఆమె పాత్రపై విచారణ చేయాలని సుశాంత్ తండ్రి కోరిన సంగతి తెలిసిందే.
ఇలా అనేక మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీగా సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు తిరుగుతుంది. క్షణ క్షణం కొత్త విషయాలు బయటపడుతుండటం బాధాకరమని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనిపై సుశాంత్ తండ్రి లాయర్ వికాస్ సింగ్ స్పందిస్తూ, ముంబయి పోలీసులు జరుపుతున్న కేసు విచారణ సుశాంత్ కుటుంబానికి మానసిక క్షోభను కలిగిస్తోంది. సుశాంత్ చుట్టూ ఉన్న వారితో అతనికి అపాయం ఉందని ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియాపై ఎలాంటి విచారణ జరుపలేదు. ఆమెకి క్లీన్ చిట్ ఇవ్వడం బాధాకరం` అని తెలిపారు. మరి ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.