జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనిపై విచారణ చేపట్టాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కి ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్లో ఆ మధ్య ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి చర్చలు జరగ్గా ఎగ్జిబిటర్లు డిమాండ్లకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించలేదు.
పర్సంటేజీ ప్రకారం తమకు కలెక్షన్లు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయగా, అందుకు డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోలేదు. రెంటల్ విధానంలోనే చెల్లిస్తామని వాళ్లు తెగేసి చెప్పారు. దీంతో జూన్ 1 నుంచి బంద్కి పిలుపునిచ్చారు ఎగ్జిబిటర్లు.
జూన్ 1 థియేటర్ల బంద్ నిర్ణయం వెనక్కి?
అయితే ఇటీవల మరోసారి చర్చలు జరిగాయి. బుధవారం జరిగిన చర్చల్లో బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. థియేటర్లు నడిపిస్తూనే సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దలు సూచించినట్టు తెలుస్తుంది. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సమాచారం.
ఈ పర్సంటేజీ విధానంపై అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించిందట. దీనిపై చర్చలు జరగాల్సి ఉంది. అదే సమయంలో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు.
థియేటర్ల బంద్ అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్
ఇదిలా ఉంటే తాజాగా థియేటర్ల బంద్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జూన్లో పెద్ద సినిమాల రిలీజ్లు ఉన్నాయి. ముఖ్యంగా జూన్ 12న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ రిలీజ్ ఉంది.
ఈ నేపథ్యంలో ఆ మూవీ రిలీజ్కి ముందు థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరైనా ఉన్నారా? అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరో విచారించాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` సినిమాని దెబ్బకొట్టే కుట్ర?
ఆయన ఈ పరిణాలపై సీరియస్ అయ్యారు. సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు మంత్రి కందుల దుర్గేష్. `హరిహర వీరమల్లు` సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
థియేటర్ల బంద్పై విచారణకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం
ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించీ విచారణ చేయాలని దుర్గేష్ ఆదేశించారు.
సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ విచారణ చేపట్టాలని మంత్రి అధికారులకు తెలిపారు. దీంతో థియేటర్ల బంద్ మ్యాటర్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ప్రభుత్వం జోక్యంతో ఇది సీరియస్గా మారబోతుంది. మరి దీనిపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.