మాస్టర్ చైతన్య మరణం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. . ఆయనతో అనుబంధం ఉన్న రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.
నిన్న పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఫేమస్ డాన్స్ రియాలిటీ షో ఢీ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని ఓ హోటల్ లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోవడానికి ముందు చైతన్య ఒక సెల్ఫీ వీడియో చేశారు. ఆ వీడియోలో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు చెప్పారు. ఢీ షో తనకు పేరు తెచ్చిపెట్టింది కానీ ఆర్థికంగా నిలబెట్టలేకపోయిందన్నారు. జబర్దస్త్ షోకి ఇస్తున్న రెమ్యూనరేషన్స్ కూడా ఢీలో ఇవ్వడం లేదన్నారు. అలా అని మల్లెమాల సంస్థపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
అప్పులు చేస్తే తీర్చే సత్తా ఉండాలి. నాకు ఉంది కానీ... ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అన్నారు. ఈ జీవితం చాలు. పేరెంట్స్ క్షమించాలని ఆ వీడియోలో చైతన్య కోరాడు. తన సన్నిహితులను చివరిసారిగా తలచుకున్నాడు. ఇక చైతన్య మరణవార్త బుల్లితెర వర్గాలను భారీ షాక్ కి గురి చేసింది. చైతన్యతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. చైతన్య ఇలా చేసి ఉండాల్సింది కాదంటున్నారు.
యాంకర్ రష్మీ గౌతమ్ ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. 'నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. ఫ్యామిలీకి సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని రష్మీ గౌతమ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ షేర్ చేశారు. ఢీ కొన్ని సీజన్స్ కి రష్మీ యాంకర్ గా వ్యవహరించారు. యాంకర్ సుధీర్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పంచారు. ఆ విధంగా చైతన్యతో రష్మీకి అనుబంధం ఉంది.