ఇద్దరు లెజెండ్స్ తో నేను.. 'సైరా'పై అల్లు శిరీష్ ట్వీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. విడుదల సమయం దగ్గర పడేకొద్దీ ప్రచార కార్యక్రమాలని చిత్ర యూనిట్ ముమ్మరం చేస్తోంది.
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ తాజాగా సైరా చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందించాడు. శిరీష్ టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో అతడి చిత్రాలు విజయం కావడం లేదు. శిరీష్ ఈ ఏడాది నటించిన ఎబిసిడి చిత్రం నిరాశపరిచింది.
ప్రస్తుతం కొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ కు శిరీష్ సిద్ధం అవుతున్నాడు. తాజాగా అల్లు శిరీష్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం గురించి ఓ ట్వీట్ చేశాడు. సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ లొకేషన్ లో చిరు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ లని కలుసుకున్న ఫోటోని షేర్ చేశాడు. ఇద్దరు లెజెండ్స్ తో గడిపిన క్షణాలు అని శిరీష్ కామెంట్ పెట్టాడు.
దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన సైరా చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. నయనతార హీరోయిన్. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించాడు.