సారాంశం

పుష్ప 2 చిత్రీకరణ దశలో ఉండగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఆయన లీక్ చేశారు. 
 

పుష్ప అల్లు అర్జున్ ఇమేజ్ ఆకాశానికి చేర్చిన చిత్రం. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వారి ఆలోచన ఫలితం ఇచ్చింది. బాలీవుడ్ లో పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. మొత్తంగా పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. 

ఈ క్రమంలో పార్ట్ 2 భారీగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప ది రూల్ బడ్జెట్ రూ. 350 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చిత్రీకరణ దశలో ఉన్న పుష్ప 2 గురించి మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కీలక విషయాలు లీక్ చేశాడు. సినిమా స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. ఇక జాతర నేపథ్యంలో గంగమ్మ అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ మీద తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని, దేవిశ్రీ అన్నారు. 

గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ లుక్ ఇప్పటికే పిచ్చ వైరల్ అయ్యింది. భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ గెటప్ లో భారీ యాక్షన్ సీన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దేవిశ్రీ చేసిన కామెంట్స్ మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 

అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, అనసూయ ఇతర కీలక రోల్స్ లో కనిపించనున్నారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.