#Pushpa:‘పుష్ప’రష్యా వెర్షన్ షాకింగ్ రిజల్ట్...నిజమా?
రష్యాలో పుష్ప ప్రమోషన్ల కోసమే ఆ టీమ్ ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది నిజంగా చాలా ఎక్కువే.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అనేక దేశాల్లో బ్లాక్బాస్టర్గా నిలిచింది. ఇప్పుడు పుష్ప వంతు వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప:ది రైజ్’ ఇప్పటికే పలు భాషల్లో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా రష్యాలోనూ రిలీజైంది.
మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను రష్యన్ సబ్టైటిల్స్తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమాను రష్యన్ డబ్బింగ్ వర్షన్ను విడుదలచేయనున్నట్లు ప్రకటించిన చిత్రటీమ్ ఆ తర్వాత డబ్బింగ్ పనులు పూర్తి చేసింది. డిసెంబర్ 8న విడుదల చేసింది. అక్కడి 24 నగరాల్లో ఈ మూవీ రిలీజైంది. రిలీజ్ కు ముందు డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్లో మూవీ టీం అభిమానులతో ముచ్చటించింది. దీని కోసం పుష్ప టీమ్ రష్యా వెళ్లింది. అంతా బాగానే ఉంది కానీ అక్కడ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమా రష్యన్ డబ్బింగ్ వెర్షన్ కోసం చిత్ర నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. అలాగే ప్రమోషన్ కు, రిలీజ్ కు సైతం డబ్బులు నీళ్లలా పోసారు. మొత్తంగా రష్యాలో పుష్ప ప్రమోషన్ల కోసమే ఆ టీమ్ ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసింది. ఇది నిజంగా చాలా ఎక్కువే. ఇండియన్ సినిమాలకు పెద్దగా మార్కెట్ ఉండని రష్యాలాంటి దేశంలో ఇంత పెద్ద మొత్తం కేవలం ప్రమోషన్లకే చేయడం విశేషమే.
అయితే ఆ తర్వాత అక్కడ రెస్పాన్స్ ఎలా ఉందనే విషయమై అప్డేట్ ఇవ్వలేదు. దాంతో ఈ సినిమా అక్కడ అస్సలు వర్కవుట్ కాలేదు. అందుకే ఈ రష్యన్ రిలీజ్ విషయమై నిర్మాతలు, టీమ్ సైలెంట్ అయ్యిపోయారని అంటున్నారు. ప్రొడక్షన్ యూనిట్ కూడా సోషల్ మీడియాలో కానీ మరొక చోట కానీ ఈ సినిమా ఫెరఫార్మెన్స్ గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. అలాగే రిలీజ్ తర్వాత రష్యన్ ఆడియన్స్ రెస్పాన్స్ ,వారి అభిప్రాయాలు కూడా ఎక్కడా లేవు. దాంతో ఈ సినిమా అక్కడ జనం పెద్దగా ఆసక్తి చూపించలేదనే ప్రచారం ఊపందుకుంది. నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
మరో ప్రక్క ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఫస్ట్ పార్ట్ అఖండమైన విజయం సాధించడంతో రెండోభాగం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప: ది రూల్’ను అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేస్తోంది చిత్ర టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.