ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రేపు విడుదల చేయాల్సిన కొత్త లుక్ విడుదలైంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.
అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప 2` సినిమా నుంచి ట్రీట్ వచ్చింది. మూడు నిమిషాల నిడివి గల `వేర్ ఈజ్ పుష్ప` పేరుతో ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది టీమ్. పుష్ప ఎనిమిది బుల్లెట్ల గాయంతో తప్పించుకున్నారని చెప్పగా, పుష్ప చనిపోయి ఉంటాడని, పోలీసులు డ్రామా చేస్తున్నారని, పుష్ప విదేశాలకు పారిపోయి ఉంటాడని మీడియాలో కథనాలు వస్తుంటాయి. ఇంతలో దొరికిన ఓ కెమెరా రికార్డింగ్ వీడియోలో పుష్ప కనిపించడంతో జనం సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏకంగా పుష్ప రంగంలోకి దిగి ఇది పుష్ప రూలు అంటూ చెప్పడంతో వీడియో అదిరిపోయింది.

రేపు(ఏప్రిల్8)న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు ఫ్యాన్స్ కి `పుష్ప2` నుంచి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది టీమ్. అయితే రేపు శనివారం మరో ట్రీట్ ఉంటుందని భావించారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బర్త్ రోజున `పుష్ప2`లోని బన్నీ కొత్త లుక్ లీక్ అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ లుక్లో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉండటం విశేషం. ఇందులో బన్నీ ఏకంగా అమ్మోరు అవతారంలో కనిపిస్తున్నారు.
ముఖానికి రంగులు పూసుకుని, ముక్కు పుడక, మెడలో బత్తాయి కాయల దండ, పులదండ, నగల హారాలు ధరించి చీరకట్టుకుని కండలు తిరిగిన దేహంతో, చేతిలో తుపాకి పట్టుకుని కోపంతో కనిపిస్తున్నాడు బన్నీ. చేతులకు బంగారు గాజులు, ఉంగరాలు ధరించారు. ఇందులో ఆయన లుక్ పూర్తి భిన్నంగా ఉండటమే కాదు, నెవర్ బిఫోర్ అనేలా ఉండటం విశేషం. ఓ రకంగా అమ్మోరికి పూనకాలు వచ్చినట్టుగానే, ఈ లుక్ని చూస్తే బన్నీ ఫ్యాన్స్ కూడా ఊగిపోవడం పక్కా అని అంటున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం ఈ లీక్డ్ బన్నీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది రేపు టీమ్ విడుదల చేయబోతున్న లుక్ అని తెలుస్తుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓ నెటిజన్ దీన్ని తాను ముందే ఊహించానని చెబుతూ ఈ పోస్టర్ని పంచుకోవడ విశేషం. దీనిపై బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా అసలు మాస్ అని, తెలుగులో ఏ హీరో ఇలాంటి సాహసం చేయడని అంటున్నారు. దీన్ని వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. రేపు విడుదల చేసే పోస్టర్ ఇదే అయితే వెండితెరకి పూనకాలు రావాల్సిందే అంటున్నారు. ప్రస్తుతం బన్నీ ఈ నయా లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుండటం విశేషం.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప2` మూవీ రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి కొనసాగింపు(రెండో పార్ట్). ఇందులో కూడా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ దీన్ని మరింత లావిష్గా రూపొందిస్తుండటం విశేషం. విలన్గా ఇందులో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
