పాన్ ఇండియాను దాటి.. పాన్ వరల్డ్ సినిమా వైపు పరుగులెడుతున్న టాలీవుడ్.. జాతీయా అవార్డ్ లలో సత్తా చాటింది. ఈసారి తెలుగు సినిమా 10 నేషనల్ అవార్డ్స్ తో సత్తా చాటింది. అందులో ఆర్ఆర్ఆర్ అత్యధిక అవార్డ్స్ ను కైవసం చేసుకోగా.. ఉత్తమ కథానాయకుడిగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మెరుపులు మెరిపించేశారు.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ను ఎన్నుకుని.. ప్రతీ ఒక్క సినిమా వ్యక్తి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డ్ లను ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఈ ఏడాది విజేతలుగా నిలిచిన వారి లిస్ట్ ని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
2021 లో సెన్సార్ అందుకున్న సినిమాలు 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బరిలో నిలిచాయి. వాటిలో పుష్ప ది రైజ్ , జై భీమ్, మిన్నల్ మురళి, 83, సర్దార్ ఉదం, మిన్నల్ మురళి, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు మరియు గంగూబాయి కతియావాడి లాంటి సినిమాలు పోటీ పడగా.. ఆర్ఆర్ఆర్, గంగూబాయి ఎక్కువ అవార్డ్ లను కైవసం చేసుకున్నాయి. ఇక మన తెలుగు సినిమాలకు అవార్డ్ ల పంట పండింది. 69 వ జాతీయ అవార్డ్ లలో సత్తా చాటిన మన తెలుగు సినిమాల గురించి చూస్తే..?
ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అజ్జున్ అవార్డ్ ను గెలుచుకున్నారు. పుష్ప ది రైజ్ సినిమాకు గాను అల్లు అర్జున్కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం.. డైలాగ్ డెలివరీ.. ఆయన నటనకు దేశమంతా ఫిదా అయ్యింది. నేషనల్ అవార్డ్ జూరీ కూడా అల్లు అర్జున్ నటనకు మెస్మరైజ్ అయ్యారు. బన్నీకి ఈ అవార్డ్ రావడంతో బన్నీ ప్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీ అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక జాతీయ అవార్డ్ లలో.. ఎక్కువ అవార్డ్ లను తన ఖాతాలో వేసుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటించారు. ఈ సినిమాకు మొత్తంగా ఆరు జాతీయ అవార్డ్ లు వరించాయి. బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ప్రేమ్ రక్షిత్ మాస్టార్ ను జాతీయ అవార్డ్ వరించింది. ఈసినిమాలో నాటు నాటు పాటను ఆయన కంపోజ్ చేశారు. ఈపాటను ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే. ఇక ఈసాంగ్ కు అద్భుతమైన డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ను నేషనల్ అవార్డ్ వరించింది.
ఇక ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఈసినిమాకు చేసిన బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ కు గాను బెస్ట్ మ్యూజిక్ విభాగంలో నేషనల్ అవార్డ్ వరించింది. ఇక ఇదే సినిమాలో కొమురం భీమూడో పాటను ఆలపించిన కీరవాణి తనయుడు కాలభైరవాకు కూడా ఈసాంగ్ కు గాను బెస్ట్ సింగర్ గా జాతీయ అవార్డ్ వరించింది. ఇక ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు పాటను కూడా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి ఆలపించాడు కాలభైరవ.
వీటితో పాటు ఆర్ఆర్ఆర్ కు అందించిన అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను.. శ్రీనివాస మోహన్ కు జాతీయ అవార్డ్ ను ప్రకటించింది కేంద్రం. ఆసినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగం గురించి హాలీవుడ్ లో కూడా ప్రత్యేక చర్చ జరిగింది అంటే.. ఆర్ఆర్ఆర్ గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యాయో తెలుస్తోంది. అటు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా కింగ్ సోలోమాన్ ను కూడా నేషనల్ అవార్డ్ వరించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లకు గాను ఈ అవార్డ్ ప్రకటించారు. ముఖ్యంగా ఈసినిమాలో ఎన్టీఆర్ యానిమల్స్ తో కలిసి బ్రిటీష్ వారిపై దాడి చేసే సీన్, క్లైమాక్స్ లో అల్లూరిగా రామ్ చరణ్ ఫైట్ సీన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఇక ఆర్ఆర్ఆర్ ఆరు అవార్డ్ లు కైవసం చేసుకోగా.. ఇక పుష్ప రెండు జాతీయ అవార్డ్ లను గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ను నేషనల్ అవార్డ్ వరించింది. ఇక ఈ మూవీకి బెస్ట్ మ్యూజిక్ అందించినందుకు గాను దేశిశ్రీ ప్రసాద్ కు జాతీయ అవార్డ్ ప్రకటించింది ప్రభుత్వం. ఈసినిమాలు పాటలన్నీ హైలెట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రెటీలు.. పుప్ప పాటతో రీల్స్, మీమ్స్ చేశారంటే ఈ పాటలు ఎంత ప్రభావం చూపించాయో అర్ధం అవుతుంది. ముఖ్యంగా చూపే బంగారమాయనే సాంగ్ తో పాటు... సమంత ఐటమ్ సాంగ్.. పుష్ప టైటిల్ సాంగ్.. సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
ఇక ఉత్తమ చిత్రంగా ఉప్పెన అవార్డ్ ను కైవసం చేసుకుంది. మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా బుచ్చిబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఉప్పెన.. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. బుచ్చిబాబును దర్శకుడిగా నిలబెట్టింది. ఈసినిమా తరువాత ఆయన చాలా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా కన్ఫామ్ చేసుకున్నాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు.
ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ కూడా జాతీయ అవార్డ్ ను సాధించాడు. అయితే ఆయనకు ఆస్కార్ తెచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి జాతీయ అవార్డ్ రాలేదు. సైలెంట్ గా వచ్చి.. ప్లాప్ సినిమాగా నిలిచిన కొండపొలం మూవీలోని ధమ్ ధమాదమ్ పాటకు గాను ఆయన్ను జాతీయ అవార్డ్ వరించింది. అయితే ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఆస్కార్ అందుకోగా.. ఈపాటకు ఆయన్ను జాతీయ అవార్ద్ వరించలేదు. క్రిష్ డైరెక్షన్ లో.. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన ప్లాప్ మూవీ కొండపొలం నుంచి ఉత్తమ గేయ రచయితగా నేషనల్ అవార్డ్ ను అందుకోబోతున్నారు చంద్రబోస్. ఉత్తమ సినిమా విమర్శకుల విభాగంలో పురుషోత్తమా చార్యులు జాతీయ అవార్డ్ ను గెలుచుకున్నారు.
ఇలా జాతీయ అవార్డ్ లలో.. దేశ వ్యాప్తంగా అన్ని భాషలను అధికమించి మన తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అత్యధిక అవార్డ్ లను సొంతం చేసుకుని.. టాలీవుడ్ ను మరోసారి అగ్రస్థానాన నిలిపాయి. కొన్ని విభాగాలలో ఇంకా తెలుగు సినిమాలకు అవార్డ్ లు రావల్సి ఉండగా.. వాటిపై కూడా కొంత అసంతృప్తి నెలకొన్నట్టు తెలుస్తోంది.