Allu Arjun: ఐకాన్ స్టార్కి సజ్జనార్ బిగ్ షాక్.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ
అల్లు అర్జున్కు టీఎస్ ఆర్టీసీ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచేలా రాపిడో ప్రకటనలో బన్నీ నటించారని నోటీసులు జారీ చేసింది తెలంగాణ ఆర్టీసీ.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి తెలంగాణ ఆర్టీసీ (TS RTC) ఎండీ సజ్జనార్ షాకిచ్చారు. ఆయన చేసిన పనికి ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టని కించపరిచేలా వ్యవహరించారనే ఆరోపణలతో బన్నీకి నోటీసులు పంపించారు. అల్లు అర్జున్తోపాటు Rapido సంస్థకి కూడా తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణాసంస్థ నోటిసులు జారీ చేయడం విశేషం. దీంతో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకి Allu Arjunకి ఆర్టీసీ నోటీసులు జారీ చేయడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల అల్లు అర్జున్ ర్యాపిడో అనే ఆన్లైన్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ యాడ్ ప్రస్తుతం టీవీ ఛానెల్స్ లో ప్రసారమవుతుంది. అయితే ర్యాపిడో సంస్థని ప్రమోట్ చేస్తూ అల్లు అర్జున్ ఈ యాడ్ చేశాడు. ఇందులో బన్నీ దోశ చేస్తూ ఓ ప్రయాణికుడికి Rapido Bike app గురించి చెబుతుంటాడు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను చూపించారు. బస్సులో ఇరుకుగా జనాలు ఎక్కుతూ దిగుతున్నారు. దాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ర్యాపిడోని బుక్ చేసుకోండి అని, దోశ తీసినంత ఈజీగా గమ్యానికి వెళ్లిపోండి అని చెప్పాడు బన్నీ. ఇందులో ర్యాపిడో బైక్ పై ఆ ప్రయాణికుడు వెళ్లిపోయాడు.
అయితే ర్యాపిడో అనే బైక్ టాక్సీ యాప్ని ప్రమోట్ చేసే క్రమంలో ఆర్టీసీ సర్వీస్ని కించపరిచేలా ఈ యాడ్ ఉందని తెలంగాణ ఆర్టీసీ భావిస్తూ బన్నీకి నోటీసులు పంపించింది. మరి దీనిపై అల్లు అర్జున్, ర్యాపిడో బైక్ యాప్ సంస్థ ఎలా స్పందిస్తున్నానేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యిమందితో ఓ డాన్స్ నెంబర్ని చిత్రీకరిస్తున్నారు. దీంతో మొదటి భాగం చిత్రీకరణ పూర్తి కానుందని టాక్. ఇక సినిమాని త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.
`పుష్ప` పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని డిసెంబర్లో రిలీజ్కి ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బన్నీ `పుష్పరాజ్` అనే పాత్రలో డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నారు. ఆయన ఎర్రచందన స్మగ్లర్గా కనిపిస్తాడని టాక్. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సునీల్ పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, దానికి అద్భుతమైన స్పందన లభిస్తుంది. మరోవైపు రేపు(బుధవారం) అనసూయ పాత్రని పరిచయం చేయబోతున్నారు.
also read: అల్లు అర్జున్, రణవీర్ సింగ్ నటించిన స్టార్ స్టడెడ్ క్యాంపైన్ను ప్రారంభించిన ‘ర్యాపిడో’