సారాంశం

నిర్మాత అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఆ స్టార్‌ డైరెక్టర్‌ని ఉద్దేశించేఈ వ్యాఖ్యలు చేశారంటూ రచ్చ మొదలైంది. 

మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌.. తాజాగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా `తండేల్‌` సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నేడు ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా డైరెక్టర్లపై పంచ్‌లు వేశారు. `ఇవాళ ఓ దర్శకుడు ఒక హిట్‌ సినిమా ఇస్తే, వెంటనే బోలెడు ఆఫర్లు ఉంటాయి. కానీ దానికి ముందు ఎప్పుడో ఉన్న కమిట్‌మెంట్‌ని గౌరవిస్తూ చేయడమనేది గొప్ప విషయమన్నారు అల్లు అరవింద్. 

జనరల్‌గా రాజమౌళి ఇలాంటిది చేస్తారని, అది మనందరికి తెలుసు అంటూ అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. అలా ఎంత మంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నేను గీతా ఆర్ట్స్ తోనే చేయాలనుకున్నా అని చందూమొండేటి వచ్చారని, ఆ కథని పట్టుకుని, ఆ కథకి ఎవరైతే కరెక్ట్ గా సెట్‌ అవుతారో అని నాగచైతన్యని ఒప్పించారు. ఇప్పుడు ఆయనకు సరైన జోడీ ఎవరు అనుకున్నప్పుడు మా బంగారు తల్లి సాయిపల్లవి వద్దకు వెళ్లారు. ఆమె కూడా కథ విని ఎగ్జైట్‌ అయి, ఇది నేను చేయాల్సిన సినిమా అని ఆమె వెంటనే ఒప్పుకుందన్నారు. 

ఈ మధ్య మనం సినిమా చూడటం మారిందని, చాలా పెద్దగా (భారీ స్కేల్‌లో) చూడాలని ఇష్టపడుతున్నామని, అలానే సినిమాలు చేయాల్సి వస్తుందని, అలాగే రిలీజ్‌ చేయాలని ఇతర భాషల్లో కూడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని, అందుకు ఆల్‌ ఇండియా సౌండ్‌ అలవాటు పడ్డ మన దేవిశ్రీ ప్రసాద్‌ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నారని తెలిపారు అల్లు అరవింద్‌. చాలా రోజుల తర్వాత తాను ఈ కథకి చాలా ఎగ్జైట్‌ అయినట్టు చెప్పారు. 

ఇదిలా ఉంటే అల్లు అరవింద్‌ ఇందులో ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. దర్శకుడికి హిట్‌ వస్తే ఇతర ఆఫర్లకు వెళ్లిపోతున్నారని, కానీ చందూమొండేటి, రాజమౌళి లాంటి వాళ్లు మాత్రం తమ కమిట్‌మెంట్‌కి కట్టుబడి ఉంది సినిమాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలను `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్‌కి అన్వయించి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. అల్లు అరవింద్‌ పరోక్షంగా ఆ డైరెక్టర్‌ నే టార్గెట్‌ చేశారని అంటున్నారు. 

Scroll to load tweet…

గీతా ఆర్ట్స్ లో పరశురామ్‌ `గీత గోవిందం` సినిమా చేశారు. విజయ్‌ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రం పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. వంద కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీకి షాకిచ్చింది. ఈ సినిమాతో అటు విజయ్‌, ఇటు రష్మిక స్టార్స్ అయిపోయారు. అయితే ఆ తర్వాత కూడా పరశురామ్‌.. గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలనే కమిట్‌ మెంట్‌ ఉందట. మళ్లీ విజయ్‌తోనే అని టాక్‌. కానీ పరశురామ్‌ తమ బ్యానర్‌లో కాకుండా దిల్‌రాజు ప్రొడక్షన్‌లో ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్‌` చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయంలో అల్లు అరవింద్‌ బాగా హర్ట్ అయ్యారు. అప్పుడు రచ్చ కూడా అయ్యింది. దీన్ని ప్రెస్‌ మీట్‌ పెట్టి మీడియా వేదికగా తన ఆవేదన, జరిగిన విషయాలను ఆయన వెల్లడించాలనుకున్నారు. కానీ ఎందుకు రచ్చ చేయడమనే కొందరి ఒత్తిడి మేరకు ఆయన వెనక్కి తగ్గారు. కానీ ఆయన దాన్ని మర్చిపోలేదు. ఇలా పరోక్షంగా ఆ ఘటనపై సెటైర్లు వేస్తూనే ఉన్నారని తాజా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది. 
 

YouTube video player