RRR: కశ్మీరు లోయలో 'ఆర్ఆర్ఆర్' షోలు ...కేక కదా ..!!
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దశాబ్ధాలుగా నెలకొని ఉన్న ఉగ్రవాదం కారణంగా అక్కడి థియేటర్లు అన్ని మూతపడిన సంగతి తెలసిిందే. మళ్లీ ఎవరూ కూడా థియేటర్లను తెరవడానికి ప్రయత్నించలేదు. ఆర్టికల్ 370 రద్దు తరవాత జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు భద్రతా బలగాలు చెక్ పెడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్లో మూడు దశాబ్దాల అనంతరం సినిమాహాళ్లు పునఃప్రారంభమయ్యాయి. ఉగ్రవాదం కారణంగా ఇక్కడ థియేటర్లన్నీ మూతపడడంతో వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వమే మల్టీఫ్లెక్స్లు నిర్మించింది.
దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్లను ఆదివారం జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్ యూత్ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. ఇవి బహుళ ప్రయోజన సినిమాహాళ్లని సిన్హా చెప్పారు. ఇక్కడ సినిమాల ప్రదర్శనలతోపాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్లో ఆర్ఆర్ఆర్, మరోదాంట్లో భాగ్ మిల్కా భాగ్లను ప్రదర్శించారు.
1980 చివరి వరకు కాశ్మీర్ లోయలో 15 సినిమా హాళ్లు పనిచేశాయి. వాటిలో తొమ్మిది ఒక్క శ్రీనగర్ ప్రాంతంలోనే ఉండేవి. రెండు ఉగ్రవాద సంస్థలు చేసిన హెచ్చరికల కారణంగా యజమానులు వాటిని మూసివేశారు. 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతంలో రీగల్ సినిమాపై పున:ప్రారంభించిన రోజే గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. పదికిపైగా మంది గాయపడ్డారు. అనేక సినిమా హాళ్లు షాపింగ్ కాంప్లెక్సులుగా.. నర్సింగ్హోమ్లుగా మార్చబడ్డాయి. రానున్న రోజుల్లో అనంత్నాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్త్వార్, రియాసీలలో సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి.
మళ్లీ ఇంతకాలానికి వెండతెర వెలుగులు విరజిమ్మనుంది. శ్రీనగర్లోని సోంవార్ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్ సింగ్ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి. ఒకప్పుడు కశ్మీర్ షూటింగ్లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.