ఈ వార్త విని 'ఆచార్య' కాదు..' హాశ్చర్య' అంటున్నారు
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు చరణ్. కనిపించేది కొద్దిసేపే అయినా చరణ్ పాత్ర చాలా హైలెట్గా ఉంటుదని టాక్.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఆచార్య’ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొరటాల శివ సినిమాలంటే కమర్షియల్ హంగులతో పాటు సామాజిక సందేశంతో కూడి ఉంటాయి. చిరు ఇందులో మధ్య వయస్కుడైన నక్సలైట్గా కనిపిస్తారని, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతిపై పోరాడతారని టాక్. అయితే, కొరటాల శివ టేకింగ్, చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. రామ్చరణ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథనాయిక. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ నేపధ్యంలో చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అప్పుడే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే ‘ఆచార్య’ ఇంకా సెట్స్పై ఉండగానే నిర్మాతలు నాన్-థియేట్రికల్ రెవెన్యూ కింద పెద్ద మొత్తంలో అందుకోబోతున్నారని టాక్. అది ఆడియో హక్కుల ద్వారా అని వినపడుతోంది. ‘అల.. వైకుంఠపురములో..’తో కిందటేడాది భారీ విజయాన్ని అందుకోవడంతో కోట్లు గడించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఇప్పుడు ‘ఆచార్య’ ఆడియో రైట్స్ను చేజిక్కించుకుంది అనే వార్త హాట్ టాపిక్గా మారింది. ఏకంగా రూ.నాలుగు కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించి ‘ఆచార్య’ హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుందట.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో పాట చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటలో చిరు స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం.