సారాంశం

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు‌పై ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలుపగా.. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు‌పై ప్రవేశపెట్టడంతో పలువురు నటీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బుధవారం ఆమోదం తెలుపగా.. నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతున్న వేళ.. పలువురు నటీమణులను, ఇతర మహిళా ప్రముఖులు కేంద్రం పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీమణులు పార్లమెంట్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే తాజాగా సినీతారలు తమన్నా, మంచు లక్ష్మి, ఖుష్బూ‌తో పాటు పలువురు నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో వీరు పార్లమెంట్‌కు వచ్చారు. అనంతరం తమన్నా మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించారు. ఈ బిల్లు సామాన్య ప్రజలను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపిస్తుందని అన్నారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లు2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టిన వేళ సాక్ష్యంగా ఉన్న ఘనత తనకు దక్కుతుందని నటి ఖుష్బూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సాక్ష్యంగా తమను ఆహ్వానించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఖుష్బూ ధన్యవాదాలు తెలిపారు.