అలనాటి హీరోయిన్‌ మధుబాల చాలా గ్యాప్‌తో `అంతకు ముందు ఆ తర్వాత`, `సూర్య వర్సెస్‌ సూర్య`, `నాన్నకు ప్రేమతో` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతుంది. 

`రోజా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది మధూ(మధుబాల). ఇది తమిళ సినిమా అయినా తెలుగులో డబ్‌ కావడంతో విశేష ఆదరణ పొందింది. అదే ఏడాది(1992)లో రాజశేఖర్‌తో `అల్లరి ప్రియుడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మధుబాల. మంచి హిట్‌ అందుకుంది. అప్పటికే ఆమె తమిళం, మలయాళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. దీంతో తెలుగుకి టైమ్‌ ఇవ్వలేకపోయింది. మళ్లీ కొంత గ్యాప్‌ తర్వాత రాజశేఖర్‌తోనే `ఆవేశం` సినిమాలో నటించింది. `పుట్టినిళ్లు మెట్టినిళ్లు`, `చిలక్కొట్టుడు`, `గణేస్‌` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. 

ఆ తర్వాత చాలా గ్యాప్‌తో `అంతకు ముందు ఆ తర్వాత`, `సూర్య వర్సెస్‌ సూర్య`, `నాన్నకు ప్రేమతో` చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు సినిమాలతో రాబోతుంది. ఆమె సమంత మెయిన్‌ లీడ్‌గా నటించిన `శాకుంతలం`, అలాగే యంగ్‌ టీమ్‌ కలిసి చేస్తున్న `గేమ్‌ ఆన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో `శాకుంతలం` ఈ నెల 14న విడుదల కాగా, `గేమ్‌ ఆన్‌` త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది. ఈ చిత్రంలో గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కని స్పందన వచ్చిన సంగతి తెల్సిందే. ఇపుడు అదే ఉత్సాహంతో టీజర్ ను విడదల చేసారు. నాని హీరోగా నటించిన దసరా సినిమా విడుదల అయిన థియేటర్లలో ఏ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆద్యంతం ఆసక్తిగా సాగింది ఈ టీజర్. ఈ సందర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ, “గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం చక్కని సంగీతం అందించారు. గతంలో పలు చిత్రాల్లో పని చేసి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రానికి టైటిల్ సాంగ్ కి పనిచేశారు. అంత బిజీలోను మా చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఇపుడు విడుదల చేసిన రెండో పాటకు కూడా స్పందన అదిరింది. 

నాని హీరోగా నటించిన దసరా సినిమాతో మా టీజర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. స్పందన అద్భుతంగా ఉంది. దీనితో అంచనాలు పెరిగాయి. గీతానంద్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం . ఈ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్ గా ఈ సినిమా చెయ్యడం విశేషం. వారిద్దరూ కలసి నాకు చెప్పిన కంటెంట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి పనిచేశాం. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం' అని అన్నారు. 

దర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ ‘‘రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ట్విస్టులు, ట‌ర్నులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది, మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. తను ఆస్ట్రేలియా లో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్ గా ప్రతి విషయంలో అప్డేట్ లో ఉంటాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా వర్క్ చేస్తున్నాము. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి” అని అన్నారు. ఇందులో బిగ్‌ బాస్‌ వాసంతి, కిరిటీ, శుభలేక సుధాకర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.