జీవితా రాజశేఖర్ ని టార్గెట్ చేసిన సైబర్ నేరగాడు... మేనేజర్ కి భారీ టోకరా!
అత్యాశకు పోయి జనాలు ఈజీగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా నటి జీవితా రాజశేఖర్ మేనేజర్ మోసానికి గురయ్యాడు. జీవితా రాజశేఖర్ టార్గెట్ గా జరిగిన ఈ నేరంలో ఆమె తృటిలో తప్పుకున్నారు.
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాలు కదపకుండా ఒకచోట కూర్చోని అమాయకుల సొమ్ము కాజేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా నటి జీవితా రాజశేఖర్ మేనేజర్ ఈ తరహా మోసానికి బలయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం... ఓ రోజు జీవితా రాజశేఖర్ కి అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. తన పేరు షారుక్ గా పరిచయం చేసుకున్నాడు. ఏదో చెప్పబోతుంటే నేను బిజీగా ఉన్నాను, నా మేనేజర్ తో మాట్లాడండి అని జీవితా రాజశేఖర్ అతనికి సూచించడం జరిగింది.
షారుక్ అని ఫోన్ చేసిన వ్యక్తితో జీవిత మేనేజర్ మాట్లాడారు. విషయం ఏమిటని అడగ్గా... నేను జియో సంస్థలో పని చేస్తున్నాను. నాకు ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది. దానిలో భాగంగా జియా సంస్థ అమ్మే వస్తువులు ఏవైనా మీకు సగం రేటుకే ఇప్పిస్తానని నమ్మబలికాడు. మేనేజర్ కి విశ్వాసం కలిగించడం కోసం కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. రెండున్నర లక్షల విలువ చేసే ప్రోడక్ట్స్ అందులో లక్షా పాతిక వేలకు చూపించాడు.
నిజమే అని నమ్మిన జీవిత మేనేజర్ ఆ వ్యక్తికి ఆన్లైన్ లో రూ. 1.25 లక్షలు పంపాడు. ఎన్ని రోజులు ఎదురు చూసినా కొనుగోలు చేసిన వస్తువు రాలేదు. షారుక్ నుండి ఎలాంటి స్పందన లేదు. మోసపోయానని నిర్ధారణకు వచ్చిన మేనేజర్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. అతడి ఫోన్ నెంబర్, డబ్బులు పంపిన బ్యాంకు డీటెయిల్స్ ఆధారంగా చెన్నైకి చెందిన నాగేంద్రబాబు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు.
చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం నాగేంద్రబాబును అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. గతంలో కూడా నాగేంద్రబాబు పలు నేరాలు చేశాడు. సినిమా ఆఫర్స్ ఇప్పిస్తానని నటులను, అవార్డులు తెప్పిస్తానని దర్శక నిర్మాతలను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాగేంద్రబాబు నటి జీవితా రాజశేఖర్ ని మోసం చేయాలని చూశాడు. అయితే అనూహ్యంగా ఆమె మేనేజర్ బుక్ అయ్యాడు.