సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) కొద్ది క్షణాల ముందు కన్నుమూశారు. గత ఇరవై రెండు రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.నందమూరి హీరో తారకరత్న (Taraka Ratna)(39) కన్నుమూశారు. గత 22 రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయ్యింది. అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని అంతా భావించారు. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఆయన ఆరోగ్యం మరోసారి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
రీసెంట్ గా నారా లోకేష్ నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే తారకరత్నను కుప్పం ఆస్ప్రత్రికి తరలించి చికిత్సను అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బెంగుళూరుని నారాయణ హృదయాలయకు తరలించారు. తారకరత్నని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించారు.విదేశాల నుంచి ప్రత్యేకమైన వైద్య బృందం కూడా వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది.
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దిగ్గజ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనువడైన తారకరత్న 1983లో హైదరాబాద్ లో జన్మించారు. ఇక నటుడిగా 2002లో వచ్చిన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిత్రానికి రెస్పాన్స్ రావడంతో పాటు తారకరత్నకూ మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ‘యువరత్న’, ‘భద్రాది రాముడు’, ‘అమరావతి’, తదితర చిత్రాలతో అలరించారు. చివరిగా ‘S5 నో ఎగ్జిట్’ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీ కాబోతున్నారు. తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే చేరి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలోనూ ఉన్నారు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.
