నాకేం పనిలేదు.. పేరెంట్స్ కి అండగా నిలుస్తా..ఫీజులపై ఉద్యమం చేస్తాః శివబాలాజీ
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడిపై నటుడు శివబాలాజీ గళమెత్తాడు. చిన్నగా ప్రారంభించి ఇప్పుడు దాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడిపై నటుడు శివబాలాజీ గళమెత్తాడు. చిన్నగా ప్రారంభించి ఇప్పుడు దాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక ఫీజుల దోపిడి నుంచి పేరెంట్స్ కి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఇటీవల తమ పిల్లలు చదువుకునే మౌంట్ లితేరా స్కూల్లో అధిక ఫీజుల విషయంలో శివబాలాజీ మీడియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల దోపిడిపై ఆయన హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఆ ఒక్క స్కూల్ కాదు, అన్ని ప్రైవేట్ స్కూల్స్ లోనూ పరిస్థితి అలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక పిల్లల పేరెంట్స్ కి అండగా నిలుస్తామన్నారు.
ఈ సందర్భంగా శివబాలాజీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్ వ్యాపార ధోరణిపై మండిపడ్డారు. కరోనా కాలంలో అనేక మంది అధిక ఫీజుల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని ఆవేదన వ్య్తం చేశారు. వ్యక్తిగతంగా వెళ్ళినా, మెయిల్స్ పెట్టినా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని తెలిపారు.
మౌంట్ లితేరా స్కూల్ నుంచి ఇలాంటి ఒత్తిళ్ళు ప్రారంభమయ్యాయని, ఇదే కాదు ఇతర పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, అన్ని స్కూల్స్ కలిసి సిండికేట్ అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, తమకు వేరే పని లేదని, ఇదే పనిగా పెట్టుకుంటామని చెప్పారు.
శివబాలాజీ సతీమణి మధుమిత చెబుతూ, ముఖ్యమంత్రి పై గౌరవంతో అడుగుతున్నాం. ప్రైవేట్ స్కూల్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా స్కూల్స్ ఇతర ఫీజులతో మానసిక క్షోభకి గురి చేస్తున్నాయన్నారు. తాము ఇప్పటికే 35శాతం ఫీజులు చెల్లించామని, పూర్తి ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వడం లేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని సీఎంని ఆమె కోరారు.