కరాటే కళ్యాణి-యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి వివాదం సరికొత్త మలుపుదిద్దుకుంటుంది. ఇద్దరి పై కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ సీఐపై కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే..ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఆగ్రహాంతో ఊగిపోయింది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని (Karate Kalyani) బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

ఈ విషయమై వివరణ కోరగా సీఐ సైదులు చట్ట ప్రకారం సినీనటి కరాటే కళ్యాణి, యూట్యూబ్‌ ఫ్రాంక్‌ స్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదులను తీసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేశాం. కళ్యాణి మాత్రం తనను అన్యాయంగా కేసులో ఇరికించావని గొడవ పెట్టుకొంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దాడికి కారుకులు ఎవరనేది తేలగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సీఐ సైదులు వెల్లడించారు.

అలాగే నేడు కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. కరాటే కల్యాణి చిన్నారికి కొనుగోలు చేసినట్టుగా ఫిర్యాదులు అందడంతో.. అధికారులు ఈ సోదాలు చేపట్టారు. చిన్నారికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకున్నారా..? అందుకు సంబంధించి పత్రాలు ఉన్నాయా..? అనే వివరాలను సేకరిస్తున్నారు.