సీనియర్ నటుడు జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళి, ప్రభాస్ లను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.  

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ వీబీ రాజేంద్రప్రసాద్ కుమారుడైన జగపతిబాబు హీరోగా పరిశ్రమలో అడుగు పెట్టారు. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆయన విజయాలు, ఒడిదుడుకులు చూశారు. జగపతిబాబు చాలా ఓపెన్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, మంచి చెడులు పంచుకోవడానికి సంకోచించరు. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు అనేక విషయాలపై స్పందించారు. ప్రభాస్, రాజమౌళిలను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజమౌళి కుటుంబం ఎన్ని అవార్డులు పొందినా గర్వం ఉండదు. వాళ్ళ కుటుంబంలో అందరూ అంతే. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. రాజమౌళి నా బంధువు అయినా నేను పాత్రలు అడగను. ఆయన కూడా ఇవ్వరు. ఏ పాత్రకు ఎవరు సరిపోతారో వారినే తీసుకుంటారు. సినిమా విషయంలో అంత ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ నుండి 20 శాతం నేర్చుకున్నా చాలు అన్నారు. ఇంత వరకు రాజమౌళి సినిమాలో జగపతిబాబు నటించలేదు. 

బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ కి కాల్ చేశాను. ఆయన అప్పుడు ఇండియాలో లేరు. జార్జియా నుండి నాతో ఫోన్లో మాట్లాడాడు. డార్లింగ్ నీ సమస్య ఏదైనా నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను అన్నాడు. ఇండియా వచ్చాక నన్ను కలిశాడు. ప్రభాస్ ఓదార్పు నాకు ఎంతో మేలు చేసింది. వయసులో చిన్నవాడైనా గొప్ప మనసు కలిగినవాడు. ప్రభాస్ కి ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవడం తెలియదు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తాడు... అని జగపతిబాబు చెప్పుకొచ్చారు.