సర్జరీ చేయించుకుని `ఖిలాడీ` షూటింగ్లో పాల్గొన్న నటుడు.. ప్రశంసలు
విలన్ పాత్రలతో పాపులర్ అయిన అనూప్ సింగ్ ఠాకూర్ తన ప్రొఫేషనల్ స్కిల్ ని చాటుకున్నారు. వర్క్ పట్ల ఎంత డెడికేషన్తో ఉన్నాడనే విషయాన్ని చాటుకున్నారు. ఇప్పుడు అందరి ప్రశంసలందుకుంటున్నారు.
నటుడు అనూప్ సింగ్ ఠాకూర్ విలన్గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. ఆయన తెలుగులో బన్నీ నటించిన `నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా`, సాయిధరమ్ తేజ్ `విన్నర్`, అలాగే సూర్య నటించిన `సింగం3`లో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా రూపొందుతున్న `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల అనూప్కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ను సంప్రదించాడు. డాక్టర్స్ అతనికి వెంటనే అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని సూచించారు.
డాక్టర్లు చెప్పినట్లుగానే ఆయన వెంటనే సర్జరీ చేయించుకున్నారు. కానీ సర్జరీ అయిన వెంటనే ప్రస్తుతం ఆయన నటిస్తోన్న రవితేజ `ఖిలాడి` సినిమా చిత్రయూనిట్ నుండి పిలుపు వచ్చింది. అతను పూర్తి చేయాల్సిన షూట్ ఇంకా మిగిలి ఉందని, వెంటనే షూట్లో జాయిన్ కావాలని యూనిట్ నుంచి కాల్ రావడంతో.. సర్జరీ అయి, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా ఇతర నటీనటులతో కాంబినేషన్ సీన్స్ ఉండడం, వారికి డేట్స్ ఇబ్బంది కలుగుతుందని భావించి.. వెంటనే ఆయన హైదరాబాద్ వచ్చి షూటింగ్లో పాల్గొని, అతని పార్ట్ పూర్తి చేశారు.
దీంతో అనూప్ డెడికేషన్పై చిత్రయూనిట్ ప్రశంసల వర్షం కురిపించింది. `ఖిలాడి` చిత్రంలో అనూప్ డేవిడ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం అనూప్ ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అందరి ప్రేమాభిమానాలు, సంకల్పం వల్లే తాను చేయగలిగానని, ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు అనూప్ సింగ్. అనూప్పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.