తాజాగా మరో నటుడు కరోనాతో ఐసీయూలో చేరారు. హిందీకి చెందిన నటుడు అనిరుధ్‌ దేవ్‌కి గత వారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింతగా విస్తరిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. తాజాగా మరో నటుడు కరోనాతో ఐసీయూలో చేరారు. హిందీకి చెందిన నటుడు అనిరుధ్‌ దేవ్‌కి గత వారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని మారిందని తెలుస్తుంది. 

అయితే ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి అంటూ నటి ఆషా చౌదరి తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులను అభ్యర్థించింది. ఇటీవల భోపాల్‌లో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ సమయంలో అనిరుధ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన్ని ప్రత్యేక వాహనంలో ముంబయి తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో ఐసీయూలోకి మార్చి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. 

సినిమా, టీవీ నటుడిగా రాణిస్తున్న అనిరుధ్‌ దేవ్‌ `తెరీ సాంగ్‌`, `షార్‌గల్‌`, `ప్రాణం` చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందుతున్న `బేల్ బాటమ్‌`లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అక్షయ్‌ కుమార్‌, అలియా భట్‌, అనుపమ్‌ ఖేర్‌, కార్తీక్‌ ఆర్యన్‌ వంటి వారికి కరోనా సోకిన విషయం తెలిసిందే. వారు వైరస్‌ నుంచి కోలుకున్నారు.