హైదరాబాద్ నడిరోడ్డుపై తాగుబోతుల భీభత్సం
హైదరాబాద్ నగరంలోని కొందరు తాగుబోతులు అర్థరాత్రి భీభత్సం సృష్టించారు. తాగిన మైకంలో వాహనాన్ని నడుపుతూ నిత్యం రద్దీగా వుండే ఖైరతాబాద్ విద్యుత్ సౌద ఎదుట వీరంగం సృష్టించారు. అడ్డందిడ్డంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో కొందరు మందుబాబులు మద్యం మత్తులో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా పుల్లుగా తాగేసి ఉండటంతో ఖైరతాబాద్ ప్రాంతంలో వాహనం అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. మితిమీరిన వేగంతో వెళ్లి గా ఫుట్పాత్ పై గల గోడను ఢీకొట్టారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువతులు, నలుగురు యువకులకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా వాహనం అతివేగంగా దూసుకురావడం చూసి భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ ప్రాంతంలో అర్థరాత్రి కావడం, ఫుట్పాత్ పై ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ పాటికే ప్రమాదానికి కారణమైన యువకులు,యువతులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో వెహికిల్ నెంబర్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.