చిరంజీవికి యూకే పార్లమెంట్ 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్' అవార్డు లభించింది. దీనిపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, చిరంజీవి సినీ, సేవా రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు. చిరంజీవి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి స్వయంకృషితో ఎదిగారని, ఆయన కీర్తిని ఈ పురస్కారం మరింత పెంచుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.


రీసెంట్ గా చిరంజీవి (Chiranjeevi)ని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. సినీ, సేవా రంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి లైఫ్ టైమ్ ఎఛీవ్మెంట్ అవార్డ్ ని అందించింది. చిరుకు ఈ పురస్కారం రావడంపై పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Scroll to load tweet…

‘‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి.. స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో మెగాస్టార్‌గా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఆయన్ని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో చిరంజీవి. తన సేవాగుణంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటు మరెంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేశారు’’.

‘‘ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి ఉదాహరణగా నిలిచారు. చిరంజీవి సమాజానికి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం కూడా అందించింది. తనకు యూకే పార్లమెంట్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈసందర్భంగా చిరంజీవికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకొని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యూకే అధికార లేబర్‌ పార్టీ ఎంపీ నవేందుమిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని పవన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.