Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమా "జయ" గీతాలు

Telugu hits of Jayalalithaa

అప్పట్లో ప్రఖ్యాత నటి సిమీ గరేవాల్ రెండెవూ(Rendezvous) అన్న కార్యక్రమంలో భాగంగా జయలలిత ను ఇంటర్వ్యూ చేసారు.అందులో జయలలిత తన అభిమాన నటుడిగా షమ్మీ కపూర్ ను పేర్కొన్నారు.ఒకరకంగా చూస్తే షమ్మీకపూర్ కు తెలుగు సినిమాల్లో జయలలితకూ పోలికుంది.షమ్మీ కి ముందు కాలం నాటి హీరోలంటా ప్రేమ,విరహం,విషాదం అంటూ ఎండిన చెట్ల చుట్టూ తిరుగుతూ పాడుకునేవారు.షమ్మీ వచ్చాడు...వెంటబడి,అల్లరి,కోణంగి పనులు చేసైనా ప్రేమను సాధించేవాడు.ఇక తెలుగు సినిమాల్లోనూ నాయిక అనగానే భారీ డైలాగులు,విషాద పాత్రలు.కానీ జయలలిత తెలుగులో నటించిన పాత్రలన్నీ హుషారైనవే.ఆవిడకున్నన్ని హిట్ పాటలు ఎవరికీ ఉండవు.

జయలలిత మన తెలుగు హీరోలతో నటించిన కొన్ని పాటలను చూద్దాం.

అక్కినేని

తెలుగులో రావటమే ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి మనుషులు-మమతలు లో హుషారైన పాత్ర.హీరో అక్కినేని.

 

"సిగ్గేస్తుందా,సిగ్గేస్తుందా మొగ్గలాంటి పిల్లదీ బుగ్గమీద చిటికేస్తే" అంటూ హీరో వెంటపడుతుంది నాయిక,అదీ స్విం సూట్ లో.అందుకే అప్పట్లో సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు A-certificate ఇచ్చారు.తెలుగులో తొలి పెద్దలకు మాత్రమే సినిమా ఇదే.

 

ఆ తర్వాత జగపతి వారి "ఆస్థిపరులు"లో అక్కినేని కోట్ లాగేసి "చలి చలి చలి వెచ్చని చలి" అని పాడించింది."అందరికీ తెలియనిది నీ అందంలో ఒకటుంది" అనీ పాడించుకుంది.

 

ఇదే జగపతి వారి "అదృష్టవంతులు" లో "అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావేమయ్యా ఈ బుల్లోడే బుల్లేమ్మైతే","చింత చెట్టు చిగురు చూడు చినదాని పొగరు చూడు" అనే హుషారైన గీతాలు పాడుకున్నారు.

 

హీరో జబ్బుపడితే సాధారణంగా నాయికలు దేవుడిపటాల ముందు ఏడుస్తూ భక్తిగీతాలు పాడుకుంటే ఈ సినిమాలో జయలలిత వైద్యానికి కావలసిన డబ్బు కోసం "మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో " అంటూ క్లబ్ లో నర్తిస్తుంది.

 

ఇక "ఓ బ్రహ్మచారి నిను కోరి నిలుచున్నది చిన్నది" అంటూ "బ్రహ్మచారి"ని ఆటపట్టించినా "భార్యాబిడ్డలు" ఉన్న ఒక పెద్దమనిషిని "ఆకులు పోకలు ఇవ్వొద్దూ,నా నోరు ఎర్రగ చేయొద్దు" అని పాడినా..ఆదర్శకుటుంబంలో "హల్లో సారు ఓదొరగాఉ" అని ఆటపట్టించినా "బిడియమేలా ఓ చెలి" అంటూ పాడించుకున్నా ఈవిడకే చెల్లింది.

 

మొత్తానికి వీళ్లిద్దరూ "ప్రేమలు పెళ్లిళ్లు" అనుకుంటూ చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది,మనసులు మురిసే సమయమిది అంటూ బోలెడు పాటలు పాడుకున్నారు.

 

ఎన్టీ రామారావు

 

రామారావుతో ఈవిడ సినిమాల గురించి చెప్పుకునే ముందు మరో ముచ్చట..జయలలిత తల్లిగారైన సంధ్య కూడా రామారావుతో నటించారు.తెనాలి రామకృష్ణ లో కృష్ణరాయని దేవేరి తిరుమల దేవిగా "చందన చర్చిత" అన్న జయదేవుని అష్టపదిలో,మాయాబజార్ లో లాహిరి లాహిరి పాటలో రుక్మిణీ దేవిగా కనిపించింది సంధ్య గారే.

 

అసలు యన్.టీ.ఆర్ తో ఈవిడవన్నీ జనరంజకమైన మాస్ మసాల,హుషారైన పాటలు.

 

జానపదాల్లో చిక్కడు-దొరకడులో "దోర నిమ్మపండులాగా ఊరించే దొరసాని",కదలడు-వదలడు లో "బుల్లెమ్మా సౌఖ్యమేనా",గోపాలుడు-భూపాలుడు లో "కోటలోని మొనగాడా వేటకు వచ్చావా",ఆలీబాబా 40 దొంగలు లో "నీలో నేనై,నాలో నీవై",గండికోట రహస్యం లో "మరదలు పిల్లా ఉలికిపడకు" లాంటి పాటలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.

 

ఇక సాంఘికాల్లో....కథానాయకుడు లో "ముత్యాల జల్లు కురిసే",దేవుడు చేసిన మనుషులు లో విన్నారా అలనాటి వేణుగానం..తిక్కశంకరయ్య లో "ముచ్చటగొలిపే పెళ్లిచూపులకు వచ్చావా" అంటూ fusion dance చేస్తే "ఐసరబజ్జా బుల్లెమ్మా "అనే పాటలో ఏకంగా సూర్యకాంతం తో స్టేప్పులు వేయించింది.

 

పౌరాణికాల్లో శ్రీకృష్ణ విజయం లో "పిల్లనగ్రోవి పిలుపు" పాటలో కృష్ణుడితోనే స్టెప్పులు వేయించింది.

 

దిగ్ధర్శకుడు కె.వీ.రెడ్డి చివరి సినిమా శ్రీకృష్ణ సత్య లో సత్యభామగా "ప్రియా ప్రియా మధురం","కలగంటి కలగంటినే" పాటలు ప్రేక్షకులు మరవరు.

 

కృష్ణ

 

కృష్ణతో నటించిన గూడచారి 116 లో "మనసు తీరా నవ్వులు" అనే పాశ్చత్యబాణీ పాట,"ఎర్రాబుగ్గల్మీద మనసైతే" లాంటి జానపద బాణీ పాటను,ఘంటసాల పాడిన హుషారైన గీతం "నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే" పాటలు ప్రేక్షకులను అలరించాయి.

 

శోభన్ బాబు

 

ఎన్నో వివాదాలకు,గుసగుసలకు తావిచ్చిన వీరి కాంబినేషన్ లో డాక్టర్ బాబు సినిమాలో "విఐసే కన్నులలో వేయి బాసలున్నవిలే","గాజులైతే తొడిగాడు నా రాజు","అల్లనేరేడు చెట్టుకాడ అమ్మలాలా" లాంటి పాటలున్నాయి.

ఇంకా రామకృష్ణ తో సుఖఃదుఖాలు లో "అందాలు చిందే ఆ కళ్లలోనే","ప్దారు నా వయసు" పాటలు...హరనాథ్ తో నటించిన శ్రీరామకథ లో "మాధవా మాధవా నను లాలించరా" పాటను.. జగ్గయ్యతో "ఆమె ఎవరు" సినిమాలోని "ఓ నా రాజా,రావా","అందాల ఈరేయి"(ఈపాతలు హిందీ ఓ కౌన్ థీ బాణీలు) పాటలను ప్రేక్షకులెన్నటికీ మరచిపోలేరు.

***

జయలలిత తమిళంలో కొన్ని సినిమాల్లో పాటలు పాడినా తెలుగులో  ఆలీబాబా 40 దొంగలు లోని "చల్ల చల్లని వెన్నెలాయె,మల్లెపూల పానుపాయే"పాట ఒక్కటే ఆవిడ పాడారు..

 

జయలలిత నిజానికి ప్రేమ్‌నగర్ లో నటించాల్సి ఉన్నా డేట్స్ లేక వాణిశ్రీ నటించినా,నాటి తెలుగువారి fashion icon వాణిశ్రీ ఒక ఇంటర్వ్యూలో జయలలిత  గారి నడకను అనుకరించా అని చెప్పుకున్నారు. మరో విశేషం ఈవిడ తొలి తెలుగు సినిమా నిర్మాణ సంస్థ ప్రసాద్ వారు నిర్మించిన నాయకుడు-వినాయకుడు తెలుగులో వీరి చివరి సినిమా,నాయకుడూ ఒక్కరే.

 

ప్రముఖ దర్శకుడు వంశీ శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాలో 3 పాటలు remix చేయగా అందులో సిగ్గేస్తుందా,నువ్వునా ముందుంటే పాటలు జయలలితవి కావడం ఒక విశేషం.అప్పట్లో ఆవిడే సొంతగొంతుకతో డబ్బింగ్ కూడా చెప్పుకునే వారు కాబట్టి వీరి ముద్దు మాటలను విపరీతంగా ఇష్టపడేవారట ప్రేక్షకులు.