ఫార్మసీ విద్యార్థినిపై కాలేజీ డైరెక్టర్ లైంగిక వేధింపులు... కలెక్టర్ కు ఫిర్యాదు
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసిన మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కాపాడాల్సిన స్థాయిలో వున్నవారే వారిపై కన్నేసి కామవాంఛ తీర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణ, భద్రత కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా వారిపై లైంగింక వేధింపులు ఆగడం లేదు. ఇటీవలే దిశా చట్టాన్ని తీసుకువచ్చిన జగన్ సర్కార్ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ ను కూడా రూపొందించింది. అయినప్పటికి మహిళలు, కాలేజీ యువతకు రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఓ కాలేజీ డైరెక్టరే యువతిని లైంగికంగా వేధించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
కాకినాడ సమీపంలోని తాళ్ళరేవు మండలం కోరింగలో గల కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన బయటపడింది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదివే ఓ విద్యార్ధినిపై ఏకంగా కాలేజీ డైరెక్టర్ గుండు శ్రీనివాసరావు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడట. ఆమెతో పాటు మరికొంత మందిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
read more తహసీల్దార్ వనజాక్షిపై దాడి : రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నందుకు ఆగ్రహించిన రైతులు
కాలేజి డైరెక్టర్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ హాస్టల్ విద్యార్థినులు జాయింట్ కలెక్టర్ రాజకుమారి కి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ లైంగిక వేధింపులు ఘటనపై నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ నివేధిక ఆధారంగా కాలేజీ డైరెక్టర్ పై, అతడికి సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
అయితే అధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెలవులను సాకుగా చూపి అధికారులు ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లు గుర్తించిన బాధిత విద్యార్థులు ప్రజాసంఘాల సాయంతో మరోసారి జేసిని కలిసి ఫిర్యాదు చేశారు.
కాలేజీ డైరెక్టర్ శ్రీనివాసరావు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని ప్రజా సంఘాల ఆరోపిస్తున్నాయి. 24 గంటల్లోగా అతనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.