కులాంతర వివాహానికి అడ్డుచెప్పిన పెద్దలు... ప్రేమ జంట ఆత్మహత్య
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమజంట గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మృతదేహాలు ఇవాళ నదిలో తేలడంతో ఈ విషయం బయటపడింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన యాలంగి రమేష్(25), మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన చిక్కారు దుర్గా ప్రశాంతి గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి చేసుకోవాలని భావించి ఇద్దరి తరపు పెద్దలకు తమ ప్రేమ వ్యవహారం గురించి తెలియజేశారు.
read more జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్ట్... కీలక ఆదేశాలు
అయితే వీరి కులాలు వేరు కావడంతో ఇరువురి కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఎలాగూ కలిసి బ్రతకలేకపోతున్నాము కనీసం కలిసి చనిపోదామని భావించి ఈనెల 9తేదీన ఇంటినుంచి పారిపోయారు.
అయితే వీరు తాజాగా యానాంలోని ఎదురులంక వద్ద గోదావరి నదిలో శవమై కనిపించారు. మృతదేహాలను గమనించిన స్థానికులు ఐ.పోలవరం పోలీసులకు సమాచారం అందించారు. నీటిలో నాని మృతదేహాలు కుళ్లిపోవడంతో లభించిన వస్తువుల ఆధారంగా వీరిద్దరు రాజోలు ప్రేమజంటగా పోలీసులు గుర్తించారు.
గ్రామస్తుల సాయంతో మృతదేహాలను బయటకు తీసి మలికిపురం పోలీసులకు అప్పగించారు. వారు ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
read more డిగ్రీ చదివాను... అయినా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు: మహిళా మంత్రి ఆవేదన