గతకొద్దిరోజులుగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం టిడిపిని వీడనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా జేసి ఫ్యామిలి స్ఫష్టతనిచ్చింది.  

అనంతపురం: ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని... తమ కుటుంబం పార్టీ మారనున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని జేసీ పవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అధికార వైసిపి కేసులు పెట్టి వేధించినా తగ్గే పరిస్ధితి లేదన్నారు. అయితే కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదని... కావాలంటే నేరుగా తమపైనే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దమ్ముంటే ముందు తనపైనా, చిన్నాయన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసులు పెట్టాలని పవన్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చడం లేదని కొందరు వైసీపీ పార్టీ నాయకులే అంటున్నారన్నారని పేర్కొన్నారు. 

ఎట్టిపరిస్థితుల్లోనూ జేసీ కుటుంబం టిడిపిలోనే కొనసాగుతుందని... బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని... అప్పుడు రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలా మరో రెండుమూడేళ్ళలో మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి కావడం ఖాయమని పవన్ రెడ్డి జోస్యం చెప్పారు. 

read more జగన్ సూపర్ ప్లాన్, వంశీకి స్పెషల్ బెర్త్: క్యూ లైన్లో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... జనవరి 2వ తేదీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తామని ప్రకటించి ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. ఆయారం-గాయారంలు పార్టీలోకి వస్తుంటారు పోతుంటారని వారితో టీడీపీకి ఒరిగేదేమీ లేదని అన్నారు. 

కొందరు కేవలం ఉనికిని కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతూ పబ్బం గడుపుకుంటారని విమర్శించారు. తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు కోసమే పనిచేస్తోందని... అలాంటి వారికి తాను భయపడబోనని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

read more తెలుగుదేశం హయాంలో కంపెనీలు మూతపడ్డాయి...అయినా...: టిడిపి మాజీ ఎమ్మెల్యే