Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే సాక్షి ఉద్యోగులకు జీతభత్యాలు: గోరంట్ల

చంద్రబాబు ప్రభుత్వం కులపక్షపాతాన్ని ప్రదర్శిస్తుందని అసత్య ప్రచారాన్ని చేసినవారే ఇప్పుడు సామాజికవర్గాల గురించి మాట్లాడుతున్నారని... ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఒకేఓక సామాజికవర్గం హవా కొనసాగుతున్నట్లు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి  ఆరోపించారు.  

Gorantla Butchaiah Chowdary comments on ys jagan governance
Author
Amaravathi, First Published Dec 11, 2019, 6:45 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ను ప్రస్తుతం కేవలం ఒకే ఒక సామాజికవర్గం పాలిస్తోందని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. పరిపాలనలో అతి ముఖ్యమైన పదవులన్నీ ఆ వర్గానికే కట్టబెట్టారని... నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయాన్ని పాటించడంలేదంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

గతంలో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై కులముద్రవేసిన ఆనాటి  ప్రతిపక్షపార్టీ అధికారంలోకి వచ్చాక రెడ్డిరాజ్యాన్ని నడుపుతోందన్నారు.  బుధవారం ఆయన అసెంబ్లీ సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడారు. పేరుకేమో బడుగు బలహీనవర్గాలకు, దళితులకు పెద్దపీట వేస్తున్నామంటూనే పెత్తనమంతా జగన్‌వర్గమే చేలాయిస్తోందన్నారు. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 37మంది డీఎస్పీలను ప్రమోట్‌చేస్తే వారిలో 9మంది బీసీలు, 7గురు రెడ్లు, 7గురు ఎస్సీలు, నలుగురు కాపులు, ఇద్దరేమో కమ్మవారున్నారని తెలిపారు. కానీ సాక్షిపత్రిక మాత్రం మొత్తం 35మంది కమ్మవారికి ప్రమోషన్లు ఇచ్చారంటూ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.  
 
కేవలం ఇద్దరే కమ్మవాళ్లుంటే 35మంది అన్నారని వారిలో 20మందికి జీతాలివ్వకుండా ఎందుకు వీఆర్‌లో పెట్టారని ప్రశ్నించారు. అలానే  నలుగురు అడిషనల్‌ ఎస్పీలను, ఐదుగురు ఎస్పీస్థాయి అధికారుల్ని, 54మంది సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లని ఎందుకు వీఆర్‌ పెట్టారో రాష్ట్ర ప్రభుత్వంసమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్‌ చేశారు. 

read more అత్యాచారానికి పాల్పడితే మరణిశిక్షే...ఏపి కేబినెట్ సంచలన నిర్ణయం

కమ్మజాతిలో పుట్టడమే నేరమన్నట్లుగా  వ్యవహరిస్తున్నారని... నిజాయితీగా తమపనితాము చేసుకుంటున్న పోలీస్‌ అధికారుల్ని ఏ విభాగంలోను విధులు నిర్వహించనీయకుండా ప్రభుత్వం ఎందుకు వీఆర్‌కి పంపిందని ఆయన నిలదీశారు. 72కీలక పదవుల్లో జగన్‌ సామాజిక వర్గం వారే ఉన్నారని... వారికితోడు తెలంగాణ నుంచి తీసుకొచ్చిన మరికొందరిని కూడా జగన్‌ సర్కారు అందలమెక్కించిందన్నారు. 

అదేవిధంగా సాక్షిపత్రికలో పనిచేస్తున్నవారికి రాష్ట్రప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలివ్వడం దుర్మార్గం కాదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులుగా జగన్‌ సామాజికవర్గంవారు తప్ప ఇతరులు పనికిరారా అన్నారు.

టీటీడీలో కూడా ఇదేవిధమైన ధోరణి కొనసాగుతోందన్నారు. శాసనసభలో ప్రతిపక్షసభ్యులను మాట్లాడనివ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకే సామాజికవర్గానికి పెద్దపీటవేసుకుంటూ జగన్‌ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. తానుచేసేవి నిరాధారమైన ఆరోపణలు కావని శాఖలవారీగా జరిగిన నియామకాలను నిరూపిస్తానని చౌదరి సవాల్‌ చేశారు. 

read more సొంత నియోజకవర్గంలోనే జగన్ పరిస్థితి ఇదీ... ఇక రాష్ట్రంలో...: టిడిపి ఎమ్మెల్యే

ఆఖరికి జగన్‌ జమానాలో ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్లను కూడా రెడ్లకే ఇచ్చేలా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే దెప్పిపొడిచారు. తెలుగుభాషను బొందపెట్టేలా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కారు తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా లక్ష్మిపార్వతిని, యార్గగడ్డ లక్ష్మీప్రసాద్‌ వంటి వాళ్లను నియమించామనడం సిగ్గుచేటన్నారు. 151మంది ఎమ్మెల్యేలున్నారు గనక ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios