Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: ధోని రనౌట్... గుండెపోటుతో అభిమాని మృతి

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ లో కీలక సమయంలో ధోని రనౌటవడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో  చోటుచేసుకుంది. 

world cup semi final1: team india fan dies of heart attack after Dhoni gets run out
Author
Manchester, First Published Jul 11, 2019, 5:49 PM IST

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. మాంచెస్టర్ వేదికన న్యూజిలాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇండియాకు ఓటమి తప్పలేదు. చివరివరకు గెలుపుకోసం పోరాడి ఓడిన భారత జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. మరీముఖ్యంగా 10 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన సమయంలో ధోని జట్టును గట్టెకిస్తాడని అందరు భావించారు. కానీ అతడు అనూహ్యంగా  రనౌటవడంతో కివీస్ గెలుపు ఖాయమయ్యింది. ఇలా కీలక సమయంలో ధోని రనౌటవడాన్ని తట్టుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన పశ్చిమ బెంగాల్ లో  చోటుచేసుకుంది. 

బెంగాల్ రాజధాని  కలకత్తా కు చెందిన  శ్రీకాంత్ అనే వ్యక్తి సైకిల్ షాప్ నడుపుతూ జీవించేవాడు. అయితే ఇతడికి క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. మరీముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. దీంతో అతడు ఈ ప్రపంచ కప్ ఆరంభంనుండి టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ ను మిస్సవకుండా చూస్తున్నాడు. దీంతో జట్టు ఫామ్ ను చూసి ఈసారి ప్రపంచ కప్ భారత జట్టుదేనని పిక్సయినట్లున్నాడు.  

బుధవారం ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ను  శ్రీకాంత్ సెల్ ఫోన్ లో చూశాడు. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లో   ధోని జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే కీలక సమయంలో ధోనిని మార్టిన్ గుప్తిల్ ఓ అద్భుతమైన డెరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. దీంతో అనూహ్యంగా ధోని రనౌటవడం చూసి తట్టుకోలేక శ్రీకాంత్ అపస్మారక స్థితిలోకి  వెళ్లిపోయాడు.

కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి అతన్ని దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే శ్రీకాంత్ మృతిచెందినట్లు వారు తెలిపినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.    

ఇలా సెమీఫైనల్లో భారత ఓటమిని  తట్టుకోలేక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఓ అభిమాని చనిపోయాడు. పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌.  బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితో సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios