ప్రపంచ కప్ సెమీస్... టీమిండియా చెత్త రికార్డును బద్దలుగొట్టిన కివీస్
మాంచెస్టర్ వేేదికన జరుగుతున్న ప్రపంచ కప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చెత్త రికార్డును నమోదుచేసుకుంది. భారత బౌలర్ల ధాటిని తట్టుకుని పరుగులు సాధించడంలో విఫలమైన కివీస్ బ్యాట్స్ మెన్స్ ఈ చెత్త రికార్డుకు కారణమయ్యారు.
ప్రపంచ కప్ టోర్నీలో మాంచెస్టర్ వేదికన జరుగుతున్న మొదటి సెమిఫైనల్లో టీమిండియా అదరగొడుతోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను యార్కర్ స్పెషలిస్ట్ బుమ్రా ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కేవలం ఒక్క పరుగు వద్దే పెవిలియన్ కు పంపడం ద్వారా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. దీంతో మొదటి పవర్ ప్లే కెప్టెన్ విలియమ్సన్, నిలోల్స్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరు పరుగులు సాధించడం కంటే క్రీజులో కుదరుకుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
టీమిండియా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి పది ఓవర్లలో కివీస్ వికెట్ నష్టానికి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు పవర్ ప్లేలో అతి తక్కువ పరుగులు చేసిన చెత్త రికార్డు భారత జట్టు ఖాతాలో వుంది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ భారత్ కేవలం 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. తాజాగా ఆ చెత్త రికార్డు కివీస్ ఖాతాలోకి చేరింది.
అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత కివీస్ కెప్టెన్ విలియమ్సన్, నికోల్స్ జోడీ బ్యాటింగ్ వేగాన్ని పెంచారు. అయితే నికోల్స్ ను జడేజా పెవిలియన్ పంపడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో ప్రస్తుతం 20 ఓవర్లలో న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.