షోయబ్ మాలిక్ కు ఇక ఫేర్ మ్యాచ్ కూడా వుండదు: వసీం అక్రమ్ సంచలనం
ప్రపంచ కప్క టోర్నీలో ఘోరంగా విఫలమైన పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ పై క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీతో మాలిక్ కెరీర్ ముగిసినట్లేనని...కనీసం ఫేర్ వెల్ మ్యాచ్ కూడా వుండదని అన్నారు.
సీనియారిటి ట్యాగ్ లైన్ తో పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు షోయబ్ మాలిక్. అయితే ఇంగ్లాండ్ గడ్డపై అతడి సీనియారిటీ ఏమాత్రం పనిచేయలేదు. ప్రపంచ కప్ మెగా టోర్నీలో అతడు ఘోరంగా విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అతడు ఇక పాక్ జట్టులో మళ్లీ కనిపించే అవకాశాలు లేవంటూ పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
''ఏ ఆటగాడయినా చాలా హుందాగా, గౌరవంగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని అనుకుంటారు. కానీ షోయబ్ మాలిక్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో రాణించలేకపోవడంతోనే అతడి కెరీర్ ముగిసింది. ఈ టోర్నీలో అతడు ఆడిన మూడు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో చేజేతులా జట్టుకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తో ఆడిన చివరి మ్యాచే మాలిక్ కెరీర్ లో కూడా చివరి మ్యాచ్ అవుంతుందని భావిస్తున్నాను.
ప్రపంచ కప్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే కేవలం ఆతడి వీడ్కోలు కోసం పేర్ మ్యాచ్ ఆడించే అవకాశం లేదు. కాబట్టి మాలిక్ నుండి ఫేర్ వెల్ పార్టీని మాత్రమే ఆశిస్తున్నాను'' అని అక్రమ్ పేర్కొన్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ కు మాలిక్ ఎంతో సేవ చేశాడని అక్రమ్ గుర్తుచేశాడు. నిజానికి అతడు ఎన్నోసార్లు అద్భుతంగా ఆడి పాక్ కు చిరస్మరణీయ విజయాలను అందించాడని కొనియాడాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో కూడా బాగా ఆడివుంటే గౌరవంగా క్రికెట్ నుండి తప్పుకునేవాడని వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు.