Riyan Parag: బాబూ పరాగూ.. నువ్వేమైనా కోహ్లి అనుకుంటున్నావా..? ఆ యాటిట్యూడ్ ఏంటి..?
IPL 2022 GT vs RR: ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రియాన్ పరాగ్ తన అతితో వార్తల్లో నిలుస్తున్నాడు. సీనియర్లు అనే గౌరవం కూడా లేకుండా వాళ్లమీద ఇష్టారీతిన ప్రవర్తిస్తూ అభాసుపాలవుతున్నాడు.
క్రికెట్ లో భావోద్వేగాలు సహజం. యాటిట్యూడ్ చూపించడం కూడా సహజమే. కానీ మన దగ్గర స్కిల్స్ లేనప్పుడు.. ఆ యాటిట్యూడ్ అనార్థాలకు దారి తీస్తుంది. టీమిండియాలో ఫీల్డ్ లో దూకుడుగా ఉండే ఆటగాళ్లలో మాజీ సారథి విరాట్ కోహ్లి ఒకడు. మైదానంలో కోహ్లి చూపించే యాటిట్యూడ్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతడికున్న క్రేజ్.. కోహ్లి బ్యాటింగ్.. అతడు నెలకొల్పిన రికార్డుల పరంగా చూస్తే విరాట్ చూపించే దూకుడు పెద్ద విషయం కాదు. కానీ ఇంతవరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడని.. కనీసం ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనో లేక ఐపీఎల్ లోనో గొప్ప రికార్డులున్నాయా..? అంటే అదీ లేని ఓ యువ ఆటగాడు అదే యాటిట్యూడ్ చూపిస్తే.. అది అనార్థాలకే దారి తీయడం పక్కా. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా..
ఐపీఎల్-15 సీజన్ లో రెండు మూడు మ్యాచుల్లో ఆడిన పరాగ్ ప్రవర్తన చూస్తే అది అతడి యాటిట్యూడ్ కంటే పొగరు అనిపించకమానదు. ఆర్సీబీతో మ్యాచ్ లో హర్షల్ పటేల్ తో గొడవ దగ్గర్నుంచి తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లో అశ్విన్ వరకు అంతా వివాదాస్పదమే.
గుజరాత్ - రాజస్తాన్ మ్యాచ్ లో భాగంగా చివరి ఓవర్లో అశ్విన్, పరాగ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఐదో బంతి వైడ్ గా వెళ్లగా.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న పరాగ్ అక్కడ్నుంచి పరిగెత్తుకొచ్చాడు. కానీ స్ట్రైకింగ్ లో ఉన్న అశ్విన్ మాత్రం అది చూసుకోలేదు. బంతి అశ్విన్ కు దూరంగా వెళ్లినా అది కీపర్ చేతుల్లోనే పడటంతో అతడు అక్కడ్నుంచి కదల్లేదు. కానీ పరాగ్ మాత్రం రనౌట్ అయ్యాడు. రనౌట్ అనంతరం పరాగ్.. అశ్విన్ వైపు కోపంగా చూస్తూ ఏదో అనుకుంటూ పెవిలియన్ కు చేరాడు.
ఇదే మ్యాచ్ లో రాజస్తాన్ ఫీల్డింగ్ చేస్తుండగా 16వ ఓవర్లో బౌట్ల్ వేసిన ఓవర్లో మిల్లర్ కొట్టిన బంతి.. లాంగాన్ వైపునకు వెళ్లింది. అక్కడే ఉన్న పరాగ్ పరుగెత్తుకొచ్చి బౌండరీ వద్ద బంతిని ఆపాడు. కానీ అక్కడే ఉన్న మరో ఫీల్డర్ ను ‘ఏం చూస్తున్నావ్.. నేను కింద పడ్డా కదా. నువ్వు బాల్ తీసుకోకుండా ఏం చూస్తున్నావ్..?’ అన్నట్టుగా ఆగ్రహానికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఆర్సీబీతో మ్యాచ్ లో హర్షల్ పటేల్ తో కూడా ఇదే విధంగా గొడవపడ్డాడు పరాగ్. లక్నోతో మ్యాచ్ లో స్టోయినిస్ క్యాచ్ పట్టిన తర్వాత అతడు చేసిన చర్యలపై ఆసీస్ మాజీ దిగ్గజం మాథ్యూ హెడెన్ కూడా మందలించిన విషయం తెలిసిందే. ఇక పరాగ్ తాజా వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఒక సీజన్ లో 700కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లి కూడా ఇంతటి యాటిట్యూడ్ చూపించలేదని ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.