WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో  నేడు మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అలీస్సా హీలి  నాయకత్వంలోని  యూపీ వారియర్స్ ను ఢీకొననుంది. 

ముంబై వేదికగా గత మూడు రోజులుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్.. యూపీ వారియర్స్ జట్టుతో తలపడుతున్నది. ఈ రెండు జట్లూ తాము ఆడిన గత మ్యాచ్ లలో సూపర్ విక్టరీలతో జోరు మీదున్నాయి. ఆ జోరును కొనసాగించాలని నేడు ఇరు జట్లూ ఆరాటపడుతున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు రానుంది. 

నేటి మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో మార్పులేమీ లేవు. కానీ యూపీ వారియర్స్ మాత్రం గత మ్యాచ్ లో గెలిపించిన గ్రేస్ హరీస్ ను బెంచ్ లో కూర్చోబెట్టి షబ్నమ్ ఇస్మాయిల్ ను తుది జట్టులోకి తీసుకుంది. 

ఆదివారం ఢిల్లీ.. బెంగళూరుతో ముగిసిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆర్సీబీ బౌలర్లను ఢిల్లీ ఓపెనర్లు మెగ్ లానింగ్, షఫాలీ వర్మ ఉతికారేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 160 ప్లస్ పార్ట్‌నర్షిప్ జోడించారు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా జెమీమా, మరిజనె కాప్ కూడా ధనాధన్ ఇన్నింగ్స ఆడారు. ఇక బౌలింగ్ లో తారా నోరిస్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆర్సీబీ కుదేలైంది.

యూపీ కూడా తాము ఆడిన తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో తొలుత తడబడినా మిడిల్ ఓవర్స్ లో కిరణ్ నవ్‌గిరె, చివర్లో గ్రేస్ హరీస్ వీర విజృంభణతో ఆఖరి ఓవర్ లో మరో బంతి మిగిలుండగానే ఆ జట్టు విజయాన్ని అందుకుని గుజరాత్ కు షాకిచ్చింది. బౌలింగ్ లో ఫర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో ఆ జట్టు కెప్టెన్ హీలి, సెహ్రావత్, మెక్‌గ్రాత్ లు విఫలమయ్యారు. వీళ్లు ఆడాలని యూపీ కోరుకుంటున్నది. 

Scroll to load tweet…

తుది జట్లు: 

యూపీ వారియర్స్ : అలీస్సా హీలి (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ,షబ్నమ్ ఇస్మాయిల్, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లిస్టోన్, అంజలి సర్వణి, రాజేశ్వరి గైక్వాడ్

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజనె కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సీ, జెన్ జొనాసేన్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్