WPL 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆటగాళ్ల వైఫల్యం  కొనసా...గుతోంది. తొలి సీజన్ లో ఆ జట్టు వరుసగా ఐదో మ్యాచ్ లో కూడా ఓడింది. 

ప్రత్యర్థులు మారుతున్నారు. ఆడే వేదికలు మారుతున్నాయి. జట్టులో కూడా మార్పులు జరుగుతున్నాయి. పాయింట్ల పట్టికలో జట్ల తలరాతలూ మారుతున్నాయి. ఎన్ని మారినా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్థిరంగా ఉంటున్న జట్టు ఏదైనా ఉందా..? అంటే అది ఆర్సీబీ మాత్రమే. ఈనెల ఐదున ముంబై ఇండియన్స్ తో ఆడిన తొలి మ్యాచ్ నుంచి నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐదో మ్యాచ్ వరకూ ఆ జట్టును పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ లో వరుసగా ఐదో మ్యాచ్ లో కూడా ఫైనల్ చేరే అవకాశాల నుంచి దాదాపుగా దూరమైంది. 

డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసిన ఆ జట్టు.. తర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీకి ఇది నాలుగో గెలుపు. 

మోస్తారు లక్ష్య ఛేదనలో ఢిల్లీకి రెండో బంతికే షాక్ తాకింది. గత మ్యాచ్ లో ఢిల్లీకి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన షఫాలీ వర్మ తాను ఎదుర్కున్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయింది. మేగన్ షుట్ ఆమెను ఔట్ చేసింది. కానీ ఆమె స్థానంలో వచ్చిన అలీస్ క్యాప్సీ ధాటిగా ఆడింది. 24 బంతులే ఎదుర్కున్న క్యాప్పీ.. 8 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసింది. రెండో వికెట్ కు మెగ్ లానింగ్ (18 బంతుల్లో 15, 1 ఫోర్) తో కలిసి 44 పరుగులు జోడించింది.

రేణుకా సింగ్ వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన క్యాప్సీ.. ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్లో కూడా వరుసగా నాలుగు బౌండరీలు బాదింది. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఎలీస్ పెర్రీ చేతికి చిక్కింది. 9వ ఓవర్లో నాలుగో బంతికి లానింగ్ కూడా ఔటయ్యింది.

ఆ క్రమంలో జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 32, 3 ఫోర్లు) తో కలిసి మరిజనె కాప్ (32 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ఆచితూచి ఆడింది. మిడిల్ ఓవర్స్ లో ఆ జట్టు ఢిల్లీ కూడా పరుగులు చేయడానికి ఇబ్బందులు పడింది. ఆశా శోభన వేసిన 15వ ఓవర్ లో రోడ్రిగ్స్.. మూడో బంతికి రిచా ఘోష్ ఔట్ చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ.. నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. 

చివరి ఐదు ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా.. 16వ ఓవర్లో 8 పరుగులొచ్చాయి. మేగన్ షుట్ వేసిన 17వ ఓవర్లో ఐదు పరుగులొచ్చాయి. పెర్రీ వేసిన 18వ ఓవర్లో కాప్ మూడో బంతి సిక్సర్ కొట్టగా ఈ ఓవర్లో 8 పరుగులొచ్చాయి. శ్రేయాంక పాటిల్ వేసిన 19వ ఓవర్లో ఏడు పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. రేణుకాసింగ్ వేసిన మూడో బంతికి జొనాస్సెన్ (15 బంతుల్లో 29 నాటౌట్, 4 ఫోర్లు, ఒక సిక్స్) సిక్సర్ బాదింది. నాలుగో బంతికి ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. 

ఈ మ్యాచ్ లో తొలతు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఎలీస్ పెర్రీ (67), రిచా ఘోష్ (37) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీసింది.