WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో  ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.   బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో ఓటమి. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ ను చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా వీరవిహారం చేసింది. ముంబై ప్లేయర్ హీలి మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్, 13 ఫోర్లు, 1 సిక్సర్) ఆల్ రౌండ్ షో తో ఆ జట్టు ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది.

మోస్తారు లక్ష్య ఛేదనలో ముంబై ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైంది. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే బౌండరీ బాదిన మాథ్యూస్ ఇన్నింగ్స్ ఆసాంతం అదే దూకుడును ప్రదర్శించింది. ప్రీతి బోస్ వేసిన రెండో ఓవర్లో యస్తికా భాటియా (19 బంతుల్లో 24, 4 ఫోర్లు) కూడా రెండు ఫోర్లు కొట్టింది.

ప్రీతి వేసిన ఐదో ఓవర్లో మాథ్యూస్.. తొలి బంతికి సిక్స్, ఆ తర్వాత బౌండరీ బాదింది. కానీ ఇదే ఓవర్లో ఆఖరి బంతికి యస్తికా ఎల్బీగా వెనుదిరిగింది. యస్తికా నిష్క్రమించినా నటాలీ సీవర్ (29 బంతుల్లో 55 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి మాథ్యూస్ ముంబైని ముందుకు నడిపించింది. శ్రేయాంక పాటిల్ వేసిన 8వ ఓవర్ లో సీవర్ మూడు బౌండరీలు బాదింది. ఆ తర్వాతి ఓవర్ ను రేణుకా వేయగా మాథ్యూస్ కూడా రెండు ఫోర్లు కొట్టింది. పదో ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసిన మాథ్యూస్.. 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 

ఇక డెవిన్ వేసిన 11వ ఓవర్లో సీవర్ రెండు, మాథ్యూస్ ఒక బౌండరీ కొట్టారు. మేగన్ బౌలింగ్ లో ఇదే సీన్ రిపీట్ అయింది. శ్రేయాంక వేసిన 13వ ఓవర్లో అయితే సీవర్ 4, 6, 4 బాదింది. ఎల్లీస్ పెర్రీ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి సీవర్ బౌండరీ కొట్టి అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాతి బంతికే మరో బౌండరీ కొట్టి ముంబై విజయాన్ని ఖాయం చేసింది. మరో 34 బంతులు మిగిలుండానే ముంబై విజయాన్ని అందుకోవడం గమనార్హం. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో రిచా ఘోష్ (28), స్మృతి మంధాన (23), కనిక అహుజా (22) లు ఫర్వాలేదనిపించారు. బౌలింగ్ లో మాథ్యూస్.. నాలుగు ఓవర్లు విసిరి 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన ఆమె ముంబై కు రెండో విజయాన్ని అందించింది. మరోవైపు ఆర్సీబీకి ఇది వరుసగా రెండో ఓటమి. బెంగళూరు తమ తర్వతి మ్యాచ్ ను ఈ నెల 8న గుజరాత్ తో ఆడనుంది. గుజరాత్ కూడా తాము ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిన జట్టే...