గుజరాత్ బ్యాటర్లకు ఢిల్లీ బౌలర్ల కళ్లెం.. ప్లేఆఫ్స్ చేరేందుకు సదావకాశం..!
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ ప్రత్యర్థి ముందు పరుగులు చేయడంలో తడబడింది. వికెట్లు కోల్పోకున్నా గుజరాత్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు.
ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగింట్లో ఓటమి. ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ కు చాలా కీలకమని తెలిసినా ఆ జట్టు బ్యాటర్లు ధనాధన్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. మిడిల్ ఓవర్స్ లో మరీ నత్తకు నడకు నేర్పినట్టుగా గుజరాత్ ఇన్నింగ్స్ సాగింది. లారా వోల్వార్డ్ట్ (45 బంతుల్లో 57, 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీకి తోడు చివర్లో ఆష్లే గార్డ్నర్ (33 బంతుల్లో 51 నాటౌట్, 9 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్.. 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ టార్గెట్ ను ఛేదించగలిగితే ప్లేఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకున్నట్టే..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ జెయింట్స్ కు ఓపెనింగ్ జోడీ మారినా అదృష్టం మాత్రం మారలేదు. సోఫీయా డంక్లీ (4)ని తొలి ఓవర్లోనే మరిజనె కాప్ ఔట్ చేసింది. కానీ లారా వోల్వార్డ్ట్ తో కలిపి హర్లీన్ డియోల్ (33 బంతుల్లో 31, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించారు.
ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లకు పరుగుల రాక కష్టమైంది. బంతికో పరుగు అన్నట్టుగా సాగిన హర్లీన్ -లారాల భాగస్వామ్యాన్ని జొనాసేన్ విడదీసింది. ఆమె వేసిన పనదో ఓవర్లో ఐదో బంతికి హర్లీన్.. వికెట్ కీపర్ భాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. పది ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులే చేసింది.
గార్డ్నర్ - లారాల జోరు..
ఆ తర్వాత కూడా గుజరాత్ స్కోరు పరుగులు తీయలేదు. ద శిఖా పాండే వేసిన 13వ ఓవర్లో ఆష్లే గార్డ్నర్ రెండు బౌండరీలు కొట్టింది. కాప్ వేసిన 15వ ఓవర్లో గార్డ్నర్, వోల్వార్డ్ట్ లు కూడా తలా ఓ బౌండరీ సాధించారు. ఇక జొనాసేన్ వేసిన 16వ ఓవర్లో వోల్వార్డ్ట్.. తొలి బంతికి సిక్స్ కొట్టింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఇదే తొలి సిక్సర్. ఆ తర్వాత రెండు ఫోర్లు కూడా బాదింది. అరుంధతి రెడ్డి వేసిన 17వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా వోల్వార్డ్ట్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
చివర్లో..
స్కోరు మరీ తక్కువగా ఉండటంతో గార్డ్నర్ బ్యాట్ కు పనిచెప్పింది. అరుంధతి వేసిన 19వ ఓవర్లో రెండు బౌండరీలు బాదింది. కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి వోల్వార్డ్ట్ క్లీన్ బౌల్డ్ అయింది. ఈ ఇద్దరూ కలిసి 53 బంతుల్లో 81 పరుగులు జోడించారు. జొనాసేన్ వేసిన చివరి ఓవర్లో గార్డ్నర్ రెండు ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కానీ చివరి బంతికి హేమలత ఔట్ కావడంతో ఆ జట్టు 150 మార్క్ కూడా చేరలేదు.